తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణ... ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం - కల్వకుంట్ల కవిత లేటెస్ట్ వార్తలు

Kalvakuntla Kavitha elected unanimous, kavitha elected unanimous, mlc kavitha
ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

By

Published : Nov 24, 2021, 2:04 PM IST

Updated : Nov 24, 2021, 6:59 PM IST

13:59 November 24

తప్పులు ఉన్నాయని శ్రీనివాస్ నామినేషన్‌ తిరస్కరణ

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. అఫిడవిట్​లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్​ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో లేకుండా పోవటం వల్ల... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు.

మంగళవారం(నవంబర్​ 23) రోజున తెరాస అభ్యర్థి కవిత నామినేషన్ వేయగా.. ఆమెకు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీల తరఫున కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. సాయంత్రం తర్వాత ఆ నామినేషన్​లో మద్దతిచ్చినట్లు పేర్లున్న ఎంపీటీసీ నవనీత, కార్పొరేటర్ రజియా సుల్తానా.. మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్​కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై ఆసక్తి ఏర్పడింది.

ఈ పరిణామాల మధ్య రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఉత్కంఠ వీడిపోయింది. అయితే ఆరోపణలు చేస్తున్న వారి ఓటర్ కార్డు ఉందని.. వారే సంతకం చేశారని.. సంతకం చేయలేదంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్ తెలిపారు.

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్​ 16న నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 16 నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించగా.. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. 

కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

ఇవీ చూడండి:

Last Updated : Nov 24, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details