తెలంగాణ

telangana

By

Published : May 5, 2023, 8:01 PM IST

ETV Bharat / state

TU EC Meeting in Hyderabad : 'TU పాలక మండలి భేటీలో కీలక తీర్మానాలు'

Telangana University EC Meeting in Hyderabad: హైదరాబాద్​లో జరిగిన తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. మళ్లీ రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమిస్తూ తీర్మానం చేయడంతో పాటు మరో రెండు తీర్మానాలు చేశారు. ఈ నెల 12న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు.

Telangana University
Telangana University

Telangana University EC Meeting in Hyderabad: తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం తొలగడం లేదు. వరుసగా రిజిస్ట్రార్​ల మార్పు కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల కిందట ప్రొఫెసర్‌ నిర్మలాదేవి టీయూ రిజిస్ట్రార్​గా బాధ్యతలు చేపట్టగా.. ఈరోజు జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో మళ్లీ ఆచార్య యాదగిరిని కొనసాగిస్తూ తీర్మానం చేశారు. దీంతో వర్సిటీలో మరోసారి గందరగోళం నెలకొంది. తానంటే తాను రిజిస్ట్రార్ అని చెప్పుకునే పరిస్థితి తలెత్తింది.

మూడు కీలక తీర్మానాలు చేసిన పాలక మండలి: ఇదిలా ఉండగా.. ఈ రోజు హైదరాబాద్​లోని రూసా భవనంలో తెలంగాణ వర్సిటీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 10 మంది ఈసీ సభ్యులు పాల్గొన్నారు. కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ అధ్యక్షతన జరిగిన ఈ పాలక మండలి సమావేశంలో మూడు కీలక తీర్మానాలు చేశారు. ప్రొ.యాదగిరిని తిరిగి రిజిస్ట్రార్​గా బాధ్యతలు చేపట్టాలని మండలి తీర్మానం చేసింది. పాలక మండలి అనుమతి లేకుండా రిజిస్ట్రార్లుగా కొనసాగిన శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలా దేవిలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈసీ తీర్మానించింది. మూడో తీర్మానంగా తెలంగాణ యూనివర్సిటీలో అనుమతి లేకుండా చేసిన నియామకాలు, అక్రమాలపై విచారణ కోసం విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న మరోసారి సమావేశమవ్వాలని పాలక మండలి నిర్ణయించింది.

సమావేశానికి హాజరుకాని వీసీ, రిజిస్ట్రార్:అయితే.. ఈ సమావేశానికి తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా, నూతన రిజిస్ట్రార్ నిర్మలాదేవి హాజరుకాలేదు. తమకు ఎలాంటి సమాచారం అందలేదని వీసీ, రిజిస్ట్రార్ తెలిపారు. ఏప్రిల్ 19న జరిగిన పాలకమండలి సమావేశం నిర్ణయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. ఈసీ ఛైర్మన్ లేకుండా ఏ సమావేశం జరిగినా... అది చెల్లుబాటు కాదని టీయూ వీసీ రవేందర్ గుప్తా స్పష్టం చేశారు. హైకోర్టు స్టే ఉన్నాగాని సమావేశం ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని వీసీ పేర్కొన్నారు.

యూనివర్సిటీలో నవీన్ మిత్తల్ రాజకీయాలు చేస్తున్నారు:ఒకవైపు హైదరాబాద్​లో ఈసీ సమావేశం జరుగుతుండగా మరోవైపు ఇదే వ్యవహారంపై మధ్యాహ్నం వీసీ రవీందర్​ గుప్తా తాజాగా నవీన్ మిట్టల్​పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో నవీన్ మిత్తల్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. నవీన్ మిత్తల్ జోక్యం పై సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని... ఏ ఏజెన్సీ ద్వారా న్యాయ విచారణ చేయించినా తాను సిద్ధమని వీసీ రవీందర్‌ గప్తా స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details