నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక నేతలు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బెడ్లకు సరిపడా కార్మికులు సిబ్బంది లేరని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షలు ఓమయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రిలోని వార్డులకు వచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కరోనా బాధితులను బతికించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అలాంటి సిబ్బందిపైనా కనీస కనికరం చూపించకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
వారికి రోజుకు 300 ఇన్సెంట్ ఇవ్వాలి...
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి గత హామీ మేరకు రోజుకు 300 ఇన్సెంటివ్ ఇవ్వాలని, 15 రోజుల డ్యూటీ చేస్తే 15 రోజుల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని స్పష్టం చేశారు.