తెలంగాణ

telangana

ETV Bharat / state

విమానాశ్రయం వస్తుందంటా... పన్నెండెళ్ల ఆశ తీరేనంటా...! - airports in telangana

నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. పన్నెండేళ్ల నుంచి ఉన్న ప్రజల విమానాశ్రయ ఆశలు మరింత బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద రాష్ట్రంలో ఆరు చిన్న విమానాశ్రయాలకు పచ్చజెండా ఊపగా... అందులో భాగంగా జక్రాన్​పల్లిలోని ప్రతిపాదిత ప్రాంతంలో అధికారులు సర్వే చేపడుతున్నారు.

airport survey in nizamabad
airport survey in nizamabad

By

Published : Aug 9, 2020, 6:00 AM IST

విమానాశ్రయం వస్తుందంటా... పన్నెండెళ్ల ఆశ తీరేనంటా...!

దశాబ్దకాలంగా నిజామాబాద్ జిల్లా వాసులను ఊరిస్తున్న విమానాశ్రయం ఏర్పాటుపై మరోసారి సర్వే మొదలైంది. ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఏజెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించగా.... 15 రోజుల నుంచి జక్రాన్​పల్లిలో పనులు సాగుతున్నాయి. 2013లో ఒకసారి... అంతకంటే ముందు మరోసారి ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసింది. 2018లోనూ ప్రతిపాదిత స్థలంలో ఎంత భూమి వినియోగించుకునే విషయాన్ని పరిశీలించారు. ఉడాన్ కింద కేంద్రం విమానాశ్రయ ఏర్పాటు నిర్ణయం తీసుకోగా.. గత ఆగస్టులోనే ఏఏఐ అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించగా.. సరిగ్గా ఏడాదికి ఇప్పుడు మరో సర్వే జరుగుతోంది.

భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధం...

తొలుత జక్రాన్​పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు 2వేల ఎకరాలు కావాల్సి ఉంటుందని భావించారు. ఆ తర్వాత ఉడాన్ కింద దేశీయ విమానాశ్రయం మాత్రమే నిర్మించేందుకు మొగ్గుచూపగా 1600 ఎకరాలు చాలని భావించారు. అందులో జక్రాన్​పల్లి, కోలిప్యాక్, తొర్లికొండ, మనోహరాబాద్, అర్గుల్​ గ్రామాల శివారులో ప్రతిపాదితస్థలం ఉంది. ఈ 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్ట్ భూములుండగా... 300 ఎకరాలు పట్టాభూములున్నాయి. ఒకవేళ విమానాశ్రయం వస్తుందంటే... పరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు చెబుతున్నారు.

అనుకూలతలూ ఎక్కువే...

జక్రాన్​పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు అనేక అనుకూలతలు ఉన్నాయి. దేశంలోనే పెద్దదైన 44వ జాతీయరహదారికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లా నుంచి గల్ఫ్​దేశాలకు అధికంగా ఉపాధి కోసం వెళ్లే వారికి ప్రయాణం సులువవుతుంది. హైదరాబాద్​కు 170 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల శంషాబాద్ మీద ఒత్తిడి పెరిగితే ప్రత్యామ్నాయంగా వాడుకోనే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అధికంగా ఉన్నాయి. వాటితో పాటు అక్కడే పండించిన పసుపు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు సులువవుతుంది.

12 ఏళ్లుగా విమానాశ్రయం కోసం ఎదురుచూస్తున్న నిజామాబాద్​ జిల్లా వాసులు ఇప్పటికైనా తమ కల సాకారం కావాలని కోరుకుంటున్నారు. విమానాశ్రయంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. పరిశ్రమలు వస్తాయని.... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆకాంక్షిస్తున్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details