ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలో కృషి చేస్తున్నామని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. తెలంగాణకు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నిర్మలా సీతారాం చెప్పినప్పటికీ... కేంద్రం నిధులివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
'కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది' - Adilabad Bhainsa Incident Latest Updates
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులివ్వలేదని మంత్రి కేటీఆర్ నిందించడం సరైంది కాదని పేర్కొన్నారు.

జిల్లాలో రూ.130 కోట్లతో ఆసుపత్రి నిర్మిస్తే... రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు ఇవ్వకపోవడం వల్ల ఆసుపత్రి పనులు ఆగిపోయాయన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేమార్గానికి కేంద్రం సానుకూలంగా ఉన్నప్పట్టికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం లేదని చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు జరిగితే రాష్ట్ర మంత్రులు, నాయకులు ఎవరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 16 న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని భైంసాకు పిలిపించి... అక్కడి ప్రజలకు భరోసా కల్పించనున్నట్లు తెలిపారు.