తెలంగాణ

telangana

అందరి పంతం.. కేసులు ఖతం

నిర్మల్‌ జిల్లాలో 21 రోజులుగా కరోనా వైరస్‌ కేసులు నమోదు కాకపోవడం.. గతంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు అందరూ కోలుకోవడం ఊరటనిస్తోంది. పాలక, అధికార యంత్రాంగం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుండటంతో జిల్లాలో పరిస్థితి సాధారణ స్థితి ఏర్పడింది. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వైరస్‌ లింక్‌ను విడగొట్టడంతో సఫలీకృతులయ్యారు.

By

Published : May 15, 2020, 7:54 AM IST

Published : May 15, 2020, 7:54 AM IST

nirmal district is in green zone as there are no corona positive cases
అందరి పంతం.. కేసులు ఖతం

రెడ్‌జోన్‌గా ఉన్న నిర్మల్‌ జిల్లాలో గడిచిన కొద్ది రోజులుగా కొత్తగా కేసులు లేకపోవడంతో ఆరెంజ్‌జోన్‌గా ప్రకటించారు. వైరస్‌ కట్టడికి అధికారులు వ్యూహం ఫలిస్తుండటంతో త్వరలో జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వచ్చేస్తోంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లాలో వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ వీడియో, టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వైరస్‌ కట్టడికి అన్నిశాఖల అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేశారు.

రెవెన్యూశాఖ

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా అదనపు పాలనాధికారి భాస్కర్‌రావు సూచనలతో డీఆర్‌వో, ఇద్దరు ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలు విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఒక్కోజోన్‌కు ఒక నోడల్‌ అధికారితోపాటు ఆరుగురు సిబ్బందిని నియమించారు. వారిద్వారా ఆప్రాంతాల్లోని వారికి కూరగాయలు, పాలు, పండ్లు, నిత్యవసర సరకులు సరఫరా చేయించారు. నిర్మల్‌లో ఏర్పాటుచేసిన అయిదు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి భోజన వసతి కల్పించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

అప్రమత్తత అవసరం

కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో కొన్ని సడలింపులు ఇవ్వడంతో జన సంచారం పెరిగింది. జిల్లా ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మారే అవకాశం ఉందని నిబంధనలు ఉల్లంఘిస్తే ముప్పు పొంచి ఉంటుంది. పట్టణాల్లో దుకాణాలు తెరవడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

వైద్యఆరోగ్య సిబ్బంది కంటైన్మైంట్‌ జోన్లలో ఉన్న వారికి 14 రోజుల పాటు నిత్యం థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలతో గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొంది కోలుకుని వచ్చిన వారికీ ప్రతి రోజూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో వ్యక్తి వద్దకు వైద్యాధికారి, హెల్త్‌ సూపర్‌వైజర్‌, హెల్త్‌ అసిస్టెంట్లలో ఒకరు వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. వీరితో పాటు విదేశాల నుంచి రాగానే హోం క్వారంటైన్‌ చేసిన 1,155 మందికి వైద్య పరీక్షలు చేశారు. 108 సిబ్బంది తమవంతు కృషి చేశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం, కోలుకున్న వారికి తిరిగి తీసుకురావడం చేశారు.

ఇప్పటివరకు జిల్లాలో..

నిర్వహించిన పరీక్షలు : 529

నెగెటివ్‌ రిపోర్టులు : 509

పాజిటివ్‌ కేసులు : 20

కరోనా నుంచి కోలుకున్న వారు : 20

పురపాలక, పంచాయతీశాఖలు

కరోనా కట్టడిలో పురపాలక, పంచాయతీశాఖలు కీలకంగా వ్యవహరించాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలతో పాటు మిగతా చోట్ల పరిశుభ్రంగా ఉంచడానికి పనులు చేశారు. అంతటా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాలతో పాటు 396 పంచాయతీల్లో 1,304 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో పాల్గొన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 14 రోజుల పాటు ట్రాక్టర్లు, అగ్నిమాపక వాహనాల ద్వారా ఈ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు విధులు సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో అవసరమైన చోట చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటుచేసి వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేసి 1,250 వాహనాలు సీజ్‌ చేశారు. జిల్లాలోని 16 కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్లను జియోట్యాగింగ్‌ చేశారు. జిల్లా సరిహద్దులను దిగ్బంధించడంతో పాటు ఆ వైపుల నుంచి అత్యవసరం పనుల కోసం వచ్చేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి లోనికి పంపించారు.

వైద్య ఆరోగ్యశాఖ

  • వైద్యులు : 30
  • వైద్యఆరోగ్య ఉద్యోగులు, సిబ్బంది : 721
  • వైద్య బృందాలు : 100

పోలీసుశాఖ

● ఎస్పీ : 01,

● ఏఎస్పీలు : 02

● డీఎస్పీలు : 02

● సీఐలు : 09,

● ఎస్సైలు : 28,

● ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు : 730,

● హోంగార్డులు : 220

ABOUT THE AUTHOR

...view details