తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​లో వలస కూలీల అవస్థలు... చేనులోనే నివాసాలు'

పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబం.. గ్రామస్థుల భయంతో అవస్థలు పడుతోంది. వేరే ఊరుకు వెళ్లొచ్చావంటూ... ఊర్లోకి రానివ్వడంలేదు. దీంతో ఆ వలస కుటుంబం బిక్కుబిక్కుమంటూ చేనులో గడపాల్సిన దుస్థితి తలెత్తింది. కరోనా భయంతో ఆ తండా వాసులు తీసుకున్న నిర్ణయం వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

By

Published : Apr 14, 2020, 5:20 AM IST

migrants-problems-in-lockdown-at-mudhol
'లాక్​డౌన్​లో వలస కూలీల అవస్థలు... చేనులోనే నివాసాలు'

లాక్‌డౌన్ వేళ వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక చోటు నుంచి మరో చోటుకి కాలినడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఊర్లకు చేరుకుంటున్నా... అక్కడా వారికి అవస్థలే ఎదురవుతున్నాయి. కరోనా భయంతో గ్రామస్థులు వారిని ఊర్లోకి రానివ్వని నేపథ్యంలో... ఊరి చివర పంట చేనుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీరు మండలం డోడర్న తండాకు చెందిన రమేశ్‌, సక్కుబాయి దంపతులు తమ కుమారిడితో కలిసి ముథోల్‌ మండలం ఎడిబిడ్ తండాకు వలస వచ్చారు. కుమారుడు బాలాజీ కామారెడ్డి ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి కొద్దిరోజుల క్రితం వెళ్లి వారం రోజులపాటు అక్కడే ఉన్నాడు. కామారెడ్డి నుంచి కాలినడకన ముథోల్‌కు చేరుకున్న బాలాజీని తండావాసులు అడ్డగించారు. ఊర్లోకి రావొద్దని అభ్యంతరం తెలిపారు. చేసేది లేక బాలాజీ సహా తల్లిదండ్రులు పంట చేనులో గుడిసె వేసుకుని ఉంటున్నారు.

సరైన తాగునీరు లేదు...

వారం రోజులుగా చేనులో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తాగేనీటికీ సైతం ఇక్కడ కష్టంగానే ఉందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ అవస్థలు తీవ్రమవుతున్నాయన్నారు. స్వగ్రామమైన కుబీరు మండలం డోడర్న తండాకు వెళ్దామనుకుంటే వారూ... రావొద్దని అంటున్నారని చెబుతున్నారు.

వైరస్ లేకున్నా... నరకయాతన

ముగ్గురికీ వ్యాధి లక్షణాలేవీ లేకున్నా వారం రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. దాతలు అందిస్తున్న నిత్యావసర సరకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా భయంతోనే వారు తండాలోకి రాకుండా తండావాసులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్‌ వెల్లడించారు.

అధికారులు స్పందించి తమను సొంతూరికి పంపించాలని వేడుకుంటున్నారు. కనీస వసతుల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ కుటుంబసభ్యులు వాపోతున్నారు.

ఇదీ చూడండి:పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

ABOUT THE AUTHOR

...view details