ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న రైతుబంధు పథకం జిల్లాలో వందలాది మంది అన్నదాతలకు అందని ద్రాక్షలా మారింది. కొంతమంది రెవెన్యూ సిబ్బంది అలసత్వం కారణంగా గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి అన్నదాతలకు పెట్టుబడి సాయం అందలేదు. ఆన్లైన్లో భూముల వివరాలు తప్పుగా నమోదు చేయడంలో ఏడాది నుంచి పాసు పుస్తకాల కోసం అన్నదాతలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి.
లోపాలు సరిచేసి రికార్డుల నవీకరణ
రైతు కష్టాలు దూరం చేయటంతో పాటు ప్రభుత్వ భూములు ఏయే సర్వేనెంబర్లలో ఉన్నాయో గుర్తించడం, ఇతరత్రా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపడానికి నిర్మల్ ఇన్ఛార్జి జిల్లా పాలనాధికారి ఎ.భాస్కర్రావు ప్రత్యేక దృష్టి సారించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆరు రోజుల ప్రత్యేక కార్యశాల ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఇక పట్టాదారు పాసు పుస్తకాల సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుండటంతో అన్నదాతల ఇబ్బందులు దూరం కానున్నాయి.