బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. నేటి నుంచే ప్రారంభం.. - High Court permitted Bandi Sanjay padayatra
Bandi Sanjay Padayatra update : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పాదయాత్రకు అనుమతి నిరాకరణపై భాజపా హైకోర్టును ఆశ్రయించింది. నిర్మల్ పోలీసులు అనుమతి నిరాకరించడంపై పిటిషన్ దాఖలు చేసింది.
![బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. నేటి నుంచే ప్రారంభం.. TS HC Permits Bandi Sanjay Padayatra in Bhainsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17051806-337-17051806-1669619061612.jpg)
12:15 November 28
బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. కానీ..?
TS HC Permits Bandi Sanjay Padayatra in Bhainsa : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసాకు 3 కి.మీ. దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచందర్రావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్మ్యాప్ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనపుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ.. ఆ ప్రాంతం చాలా సున్నితమైనదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నేటి నుంచే యాత్ర..: ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన పాదయాత్రను ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు కరీంనగర్ నుంచి నిర్మల్కు బయలుదేరనున్న ఆయన.. నేరుగా నిర్మల్లోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచే యాత్ర ప్రారంభించనున్నారు. ఇవాళ కిలో మీటరు మేర మాత్రమే యాత్ర చేయనున్నారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రేపు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరుకానున్నారు.