నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల విషయంలో కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని... పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఉత్తర మండల ఐజీ నాగిరెడ్డి తెలిపారు. రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ అల్లర్లకు దారి తీసిందని నాగిరెడ్డి పునరుద్ధాటించారు. ఈ నెల 7 న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అల్లర్లు జరగుతున్నాయని తెలిసిన వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గంటన్నరలోపే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు.
భైంసా అల్లర్ల ఘటనలో 42 మంది అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి - ఐజీ నాగిరెడ్డి తాజా వార్తలు
భైంసా అల్లర్ల కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వంద్వ వైఖరి చూపరని ఆయన తేల్చిచెప్పారు. భైంసాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్న ఐజీ... దాదాపు 500 మంది పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈకేసులో ఇప్పటికే 42 మంది అరెస్టు సహా కొంత మందిని బైండోవర్ చేశామని వెల్లడించారు.
![భైంసా అల్లర్ల ఘటనలో 42 మంది అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి 42 arrested in Bhainsa riots: IG Nagireddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11033289-755-11033289-1615901666286.jpg)
భైంసా అల్లర్ల ఘటనలో 26 కేసులు నమోదు చేసి 42మంది అరెస్ట్ చేశామని.... సీసీ కెమెరాల ఆధారంగా మరో 70మందిని గుర్తించామని నాగిరెడ్డి తెలిపారు. గతంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న 66 మందిని ముందస్తు అదుపులోకి తీసుకున్నామన్నారు. భైంసాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని... 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని నాగిరెడ్డి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన బండి సంజయ్