తెలంగాణ

telangana

మక్తల్​లో వృథాగా ప్రాజెక్టు భవనాలు.. పునరుద్ధరించాలని విజ్ఞప్తి.!

నారాయణపేట జిల్లా మక్తల్​లో సాగు నీటి ప్రాజెక్టు కార్యకలాపాల కోసం నిర్మించిన కార్యాలయాల సముదాయం నిరుపయోగంగా ఉంది. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకముందే సంబంధిత అధికారులు వాటిని ఖాళీ చేశారు. 13 ఎకరాల్లో భవనాలు నిర్మించగా.. ఐదు ఎకరాల్లో గురుకుల పాఠశాల నడుస్తోంది. మిగిలిన 8 ఎకరాల్లోని భవనాలు వృథాగా ఉన్నాయి.

By

Published : Feb 15, 2021, 5:52 PM IST

Published : Feb 15, 2021, 5:52 PM IST

makthal, project building in makthal
మక్తల్​, నిరుపయోగంగా భవనాల సముదాయం

నారాయణ పేట జిల్లా మక్తల్ ఫేజ్- 1 లో భాగంగా సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ జలాశయం పనులు పూర్తయి ఆయకట్టుకు నీరు అందించక ముందే ప్రాజెక్టు డివిజన్ కార్యాలయ సముదాయం వృథాగా మారింది. 13 ఎకరాల స్థలంలో 2003లో ఆ భవన సముదాయాన్ని నిర్మించారు. క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి 2003లో అప్పటి ప్రభుత్వం సంగంబండల గ్రామ శివారులో పదమూడు ఎకరాలను సేకరించింది. రూ. 3 కోట్ల ఖర్చుతో కార్యాలయ భవనాలను నిర్మించారు. నాలుగు బ్లాకుల్లో క్యాంపు కార్యాలయం, సంగంబండ డివిజన్ కార్యాలయంతో పాటు నలుగురు డీఈలు, 24 మంది ఏఈలకు సరిపడా భవనాలు, క్వార్టర్స్​ను నిర్మించారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ..

మొదట ఆ భవనాల్లోనే ఉంటూ ప్రాజెక్టుకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగించిన అధికారులు.. ఇప్పుడు అక్కడ ఉండటం లేదు. తద్వారా అవి నిరుపయోగంగా మారాయి. మక్తల్​కు మంజూరైన బాలికల గురుకుల పాఠశాలకు సరైన భవనాలు లభించకపోవడంతో.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆదేశంతో 2016 నుంచి ఐదెకరాల స్థలంలోని భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. గురుకుల పాఠశాల.. క్యాంపు కార్యాలయం ముందు భాగంలో ఉండటంతో ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులు, సిబ్బంది వాహనాలు అటువైపు నుంచి కార్యాలయానికి వచ్చేవి. బాలికల పాఠశాల కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పటి నుంచి ప్రాజెక్టు సిబ్బంది తమ వాహనాలను బయట ఆపి కార్యాలయానికి వెళ్లేవారు.

అధికారులు ఇబ్బందులు పడుతుండటంతో ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాలతో 2019 జులైలో ఈ కార్యాలయాన్ని మక్తల్ చిన్న నీటి పారుదల డివిజన్ కార్యాలయంలోకి తరలించారు. సంగంబండ క్యాంపు కార్యాలయంలో గురుకుల పాఠశాలకు కేటాయించగా మిగిలిన 8 ఎకరాల్లో నిర్మించిన క్వార్టర్లు, భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి కాపలా లేకపోవడంతో కొన్ని తలుపులు, కిటికీలను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు.

స్థానికులు.. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుతున్నారు. భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని.. అధికారులు స్పందించి వెంటనే వాటిని వాడుకలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details