తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2022, 5:14 PM IST

Updated : Nov 6, 2022, 8:45 PM IST

ETV Bharat / state

మునుగోడు 'గులాబీ' వశం.. 10,309 ఓట్ల మెజారిటీతో కూసుకుంట్ల జయకేతనం

TRS Won Munugode Bypoll: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల్లో... తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగురవేసింది. నాలుగో రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన తెరాస... 14వ రౌండ్ వరకు ఆధిక్యం నిలబెట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయింది.

TRS
TRS

TRS Won Munugode Bypoll: దేశ రాజకీయాల్లో అత్యంత ఖరీదైన ఎన్నికగా గుర్తింపు తెచ్చుకున్న మునుగోడు ఉపఎన్నికల్లో.. అధికార పక్షం జయకేతనం ఎగరేసింది. 15 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో... పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి జయకేతనం ఎగురవేశారు. దీంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు.

రౌండ్ల వారీగా సాధించిన ఓట్లను పరిశీలిస్తే అధికార తెరాసకు భాజపా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. పోలింగ్‌ రోజున రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాస 95,328 ఓట్లు, భాజపా 85,127 ఓట్లు, కాంగ్రెస్‌ 23,626 ఓట్లు సాధించాయి. 2014లో భాజపా-తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 27,434 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 97,239 ఓట్లు, తెరాస 74,687 ఓట్లు, భాజపా అభ్యర్థి 12,725 ఓట్లు సాధించారు.

ఉదయం 8 గంటలకు మొదటిగా చౌటుప్పల్‌లో మండలంలో అధికారులు ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఇక్కడ తొలి రౌండ్‌లో చౌటుప్పల్‌ గ్రామీణ ఓట్లను లెక్కించారు. తెరాస 1292 ఓట్ల ఆధిక్యంతో భాజపాపై ముందంజలో నిలిచింది. తెరాసకు 6 వేల 418 ఓట్లు రాగా.. భాజపాకు 5 వేల 126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2 వేల 100 ఓట్లు పోలయ్యాయి. తర్వాత రెండు, మూడో రౌండ్లలో చౌటుప్పల్‌ పురపాలిక ఓట్లను లెక్కించారు. ఈ రెండు రౌండ్లలోనూ భాజపా ఆధిక్యత ప్రదర్శించింది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి కేవలం 35 ఓట్ల ఆధిక్యంలో కారు అతికష్టం మీద ఆధిక్యతను ప్రదర్శించింది. అనంతరం నాలుగో రౌండ్‌లో... 1034 ఓట్ల తేడాతో తెరాస ముందంజలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే... పోలింగ్‌ కేంద్రం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి బయటకు రావడంతో... గందరగోళం నెలకొంది. భాజపా గెలిచిన రౌండ్లను.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం లేదంటూ వికాస్‌ రాజ్‌కు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లే.. ఆలస్యం అవుతోందని సీఈవో వివరణ ఇచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం.. రౌండ్ల ప్రకటనలో ఆలస్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పరిస్థితులు నెమ్మదిగా సర్దుకున్నాయి.

రౌండ్​ రౌండ్​కి పెరిగిన ఆధిక్యం:ఒంటిగంటకు తుది ఫలితాలు వస్తాయనుకున్న అధికారుల అంచనాలు తప్పాయి. నాటకీయ పరిణామాల అనంతరం.. సంస్థాన నారాయణపురం మండలానికి సంబంధించి, నాలుగు, ఐదు, ఆరు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఇక్కడ ఐదు, ఆరు రౌండ్‌లో గులాబీ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదో రౌండ్‌లో 817, ఆరో రౌండ్‌లో 638 ఓట్ల తేడాతో.. భాజపాపై తెరాస ముందంజలో నిలిచింది. అనంతరం మునుగోడు మండలంలో ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక్కడ కూడా తెరాస ఆధిక్యతను చూపింది. ఏడో రౌండ్‌లో 399, ఎనిమిదో రౌండ్‌లో 536 ఓట్ల తేడాతో... గులాబీ పార్టీ లీడ్‌లో నిలిచింది. మునుగోడులో భారీ ఆధిక్యాన్ని నమోదు చేసుకుంటామనుకున్న తెరాస శ్రేణుల్లో... కాస్త నిరాశ నెలకొంది. స్వల్ప ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

చండూరు మండలానికి సంబంధించి.. 8, 9, 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగింది. ఇక్కడా కారు గుర్తే ముందు వరుసలో నిలిచింది. ఎనిమిదో రౌండ్‌లో 536, తొమ్మిదో రౌండ్‌లో 852, పదో రౌండ్‌లో 484 ఓట్ల ఆధిక్యంతో... తెరాస లీడ్‌లో నిలిచింది. గట్టుప్పల మండలం ఓట్ల లెక్కింపును.. 10, 11 రౌండ్లలో కొనసాగింది. పదకొండో రౌండ్‌లో 1358 ఓట్ల తేడాతో భారీ ఆధిక్యాన్ని తెరాస తెచ్చుకుంది. అప్పటి వరకు ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండగా... గట్టుప్పల మండల ఓట్ల లెక్కింపుతో... తెరాస మెజార్టీ అనూహ్యంగా పెరిగింది.

10,309 ఓట్ల మెజారిటీతో తెరాస విజయభేరీ.. మర్రిగూడ మండలానికి సంబంధించి 11, 12, 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగింది. ఇక్కడా తెరాసనే పై చేయి సాధించింది. 12వ రౌండ్‌లో అత్యధికంగా 2 వేల 42... 13 రౌండ్‌లో తెరాస ఆధిక్యతను చూపింది. నాంపల్లి మండలం ఓట్లను 13, 14, 15 రౌండ్లలో లెక్కించారు. 13వ రౌండ్‌లో 1285 ఓట్లతో తెరాస ముందంజలో నిలిచింది. 14వ రౌండ్‌లో తెరాసకు 6608, భాజపాకు 5,553 ఓట్లు పోలయ్యాయి. 14 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస 10,191 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. చివరి రౌండ్‌లో తెరాస 1270, భాజపా 1358, కాంగ్రెస్‌ 238 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో భాజపా 88 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. 15 రౌండ్లలో కలిపి తెరాస 10,103 మెజార్టీ సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

డిపాజిట్​ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ..మొత్తంగా రెండు, మూడు, పదిహేను రౌండ్లు మినహా... 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 రౌండ్‌లలో ఏకపక్షంగా కారు ముందుకు దూసుకెళ్లింది. చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో ఇచ్చిన విధంగా... భాజపా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌ను కోల్పోయింది. 7 మండలాల్లో ఒక్క మండలంలోనూ... చెప్పుకోతగిన స్థాయిలో కాంగ్రెస్‌ ఓట్లు రాబట్టలేకపోయింది. నాలుగో స్థానంలో... బీఎస్​పీ నిలిచింది. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ తెరాస, భాజపా మధ్య హోరాహోరీ నెలకొంది. కేవలం 4 ఓట్ల ఆధిక్యతను తెరాస ప్రదర్శించింది. తెరాసకు 228 ఓట్లు రాగా.. భాజపాకు 224 ఓట్లు వచ్చాయి. బీఎస్‌పీకి 10 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కారు గుర్తును పోలిన గుర్తుల వల్లే... మెజార్టీ తగ్గిందని తెరాస శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతీ మేకర్‌, చెప్పు గుర్తులకు... దాదాపు వెయ్యి చొప్పున ఓట్లు పోలయ్యాయి.

అప్పట్లో కాంగ్రెస్‌, సీపీఐ.. ఇప్పుడు తెరాస.. :1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంపేరుతో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరుసార్లు విజయం సాధించగా సీపీఐ అయిదు సార్లు నెగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలి ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ అగ్రనేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలవగా 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. సీపీఐ ముఖ్యనేత ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994లలో గెలవగా పల్లా వెంకట్‌రెడ్డి 2004లో, ఉజ్జిని యాదగిరిరావు 2009లో విజయం సాధించారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పోటీ సాగింది. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రెండో స్థానంలో నిలవగా 2014లో ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 6, 2022, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details