ఆరేళ్ల అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడటానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. సాధారణ ఓటర్లకంటే పట్టభద్రులైతే విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఓటు కేవలం పట్టభద్రులకు మాత్రమే ఉందని.. వారిపై ఒక బాధ్యత ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నల్గొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
'రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది.. ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం పీఆర్సీలు అమలు చేయడం లేదు.. రుణమాఫీ అమలుకు రైతులు నోచుకోలేక వారిపై వడ్డీ భారం పెరిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డుల విషయంలో అమలుకు నోచుకోలేదు. వీటన్నిటికీ కారణం ఒక్కటే.. స్వార్థంతో తమ ఆస్తులను పెంచుకోవడం కోసం విపరీతంగా ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై అధిక వ్యయాన్ని వెచ్చించి రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసింది.'
కోదండ రాం, తెజస అధ్యక్షుడు