munugodu constituency : రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యంగా మారడంతో.. ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టిపెట్టాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసే పనిలోపడ్డాయి. శుక్రవారం జరిగే మునుగోడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించి వ్యూహ, ప్రచార కమిటీ సభ్యులు పర్యటించనున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుగౌడ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, సభ్యులు సీతక్క, బలరాం నాయక్ తదితరులు మండలాల్లో శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. శంకర్నాయక్ బుధవారం చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు.
ఆశావహుల విశ్వప్రయత్నాలు.. మునుగోడు స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే లక్ష్యంతో.. అధికార తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కొంత కాలం నుంచే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడుపై మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మండలాల వారీగా తెరాస ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించగా.. తాజాగా మరో సర్వే సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది. టికెట్ కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సైతం పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది.