తెలంగాణ

telangana

ప్రశాంతంగా సాగుతోన్న సాగర్​ పోలింగ్​... ఓటెత్తుతోన్న జనం

By

Published : Apr 17, 2021, 4:25 PM IST

ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పలు చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు వచ్చిన వారు... రెండు గంటల పాటు నిరీక్షించారు. ఉదయం ఆరున్నర నుంచే ఓటర్లు... పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం మొదలైంది. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయగా... మధ్యాహ్నం 3గంటల వరకు 69 శాతం ఓటింగ్ నమోదైంది.

sagar polling
ప్రశాంతంగా సాగుతోన్న సాగర్​ పోలింగ్

ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లవ్స్ అందించడంతో పాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచి... నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో... ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ కొన్ని చోట్ల ఆలస్యమైంది. గుర్రంపోడు మండలం వట్టికోడులోని ఒక బూత్​లో ఓటింగ్ యంత్రం పనిచేయలేదు. సాంకేతిక సిబ్బంది వచ్చి సరిచేసేసరికి... గంటా 15 నిమిషాలు పట్టింది. నిడమనూరులోని 201/ఏ కేంద్రంలో ఈవీఎంలో సమస్యతో 7 గంటల 56 నిమిషాలకు ఓటర్లను అనుమతించారు.

పోలింగ్​లో జాప్యం

త్రిపురారంలోని 265 బూత్​లో 20 నిమిషాలు ఆలస్యమైంది. ఏజెంట్లు సమయానికి రాలేదని అధికారులు, సిబ్బంది సీళ్లు తెరవకపోవడం వల్లే పోలింగ్​లో జాప్యం నెలకొందని ఏజెంట్లు అన్నారు. మాడుగులపల్లి మండలం అభంగాపురంలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎం మొరాయించడం వల్ల అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఓటింగ్ యంత్రాల్లో సమస్యల వల్ల ప్రజలు ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వచ్చింది.

3గంటల వరకు 69 శాతం

ఉదయం తొమ్మిదింటి వరకు 12.9 శాతంగా ఉన్న పోలింగ్... 11 గంటల వరకు 31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 1గంటల వరకు 53.3 శాతం పోలింగ్​ నమోదు కాగా... 3గంటల వరకు 69 శాతం నమోదైంది. తెరాస అభ్యర్థి నోముల భగత్... తన తల్లితోపాటు సతీమణితో కలిసి అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జునసాగర్ హిల్ కాలనీల... భాజపా అభ్యర్థి రవికుమార్ దంపతులు త్రిపురారం మండలం పలుగుతండాలో ఓటువేశారు.

పరిశీలించిన ఈసీ

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్... నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ, హిల్ కాలనీలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాలకు జనం రాక తగ్గిపోయింది. ఉదయం 11 గంటల తర్వాత... పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య తగ్గింది. అయితే పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: సాగర్ సమరం : ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details