తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు పక్కనపెట్టారు.. ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు - Nalgonda district latest news

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో మాంసం విక్రయదారులు నిబంధనలు పక్కనపెట్టి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాలువల పక్కన, రహదారుల వెంట దుకాణాలు ఏర్పాటుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మున్సిపల్​ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Meat sales in Nalgonda district Miryalaguda municipality outside regulations
నిబంధనలు పక్కనపెట్టారు.. రోడ్డు పక్కనే విక్రయిస్తున్నారు

By

Published : Jan 31, 2021, 10:11 PM IST

కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంపై అవగాహన పెంచుకున్న ప్రజలు... మాంసాహారంపై అధిక దృష్టి సారించారు. ఇదే అదనుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో మాంసం వ్యాపారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

చనిపోయిన జీవాల మాంసం...

మున్సిపాలిటీలో కొంత మంది వ్యాపారులు చనిపోయి, రోగాల బారిన పడిన జీవాల్ని సైతం కోసి విక్రయిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. బర్డ్​ ఫ్లూ భయంతో కోడి మాంసం తినేందుకు భయపడి... మటన్ వైపు మొగ్గు చూపడంతో ఎటువంటి నియంత్రణ లేకుండా మాంసం ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

భారీగా పెంచిన ధరలు...

కరోనా మహమ్మారికి ముందు మటన్ కిలో ధర రూ.500 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం దాని ధర రూ.800 వరకు పెంచారు. ఇంత ధర పెట్టి మాంసాన్ని కొన్నా... అది మంచిదో కాదో నమ్మకం లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లక్షల సంఖ్యలో జీవాలు ఉన్నప్పటికీ మాంసం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.

"ఇకనైనా పురపాలిక అధికారులు మేల్కోవాలి. పట్టణంలో నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్​ను వినియోగంలోకి తేవాలి. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని విక్రయించేలా చూసి... ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి."

------ బాలాజీ, వినియోగదారుడు, మిర్యాలగూడ పట్టణం.

రూ.84 కోట్ల వ్యాపారం..

జిల్లాలో మొత్తం జీవాల సంఖ్య దాదాపు 14.5 లక్షలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏటా వాటి ఉత్పత్తి 21లక్షల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 లక్షల కిలోల మాంసం విక్రయిస్తున్నారని అన్నారు. మొత్తం మాంసం విక్రయం ద్వారా సుమారు రూ.84 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

మాంసం విక్రయానికి ప్రభుత్వ నిబంధనలు...

పురపాలికల్లో మాంసం విక్రయించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వాటికి అనుగుణంగా మాంసం విక్రయించాల్సి ఉన్నప్పటికీ... అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గాలికొదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

1.పురపాలికల ఆధ్వర్యంలో స్లాటర్ హౌస్​ను నిర్మించి వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి.

2.పశుసంవర్ధక శాఖలో వైద్యుడు స్థాయి అధికారిని నియమించాలి.

3.జీవాలు కోయడానికి ముందు, కోసిన తరువాత వైద్యుడు పరీక్షించి మాంసం తినేందుకు పనికి వస్తుందని ధ్రువీకరించాలి.

4. ధ్రువీకరించిన జీవాల మెడపై వైద్యులు ఓ ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉన్న మాంసం మాత్రమే కొనుగోలు చేయాలి.

5. జీవాలను తప్పనిసరిగా స్లాటర్ హౌస్​లో మాత్రమే కోయాలి.

6. మాంసం దుకాణాల ఏర్పాటుకు పురపాలిక అధికారులు లైసెన్స్​లను జారీ చేయాలి.

7.దుకాణాలలో తప్పనిసరిగా పారిశుద్ధ్యం పాటించడంతో పాటు సిబ్బంది చేతి తొడుగులు ధరించాలి.

8. రహదారుల వెంట మాంసం కోసి విక్రయించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.

త్వరలోనే స్లాటర్​ హౌస్​ను వినియోగంలోకి తెస్తాం...

పట్టణంలో మాంసం విక్రయాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని మిర్యాలగూడ మున్సిపల్ కమీషనర్ చీమ వెంకన్న తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టికి వచ్చిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. స్లాటర్​ హౌస్​ పనులు దాదాపు పూర్తి అయ్యాయని... 2 నెలల్లో దాన్ని వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించి, ప్రజల ఆరోగ్యానికి కాపాడతామని చెప్పారు.

ఇదీ చదవండి: మృతి చెందిన తోటి వైద్యుడి కుటుంబానికి ఆర్థికసాయం

ABOUT THE AUTHOR

...view details