తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ సంతాపం - ktr response on swamy death

ఫ్లోరోసిస్‌ విముక్తి ఉద్యమ నాయకుడు, బాధితుడు అంశాల స్వామి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి.. ట్రై సైకిల్‌ పైనుంచి కిందపడి ప్రాణాలొదిలాడు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. అంశాల స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. స్వామి మృతిపై విచారం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. ఆయనతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.

KTR tweet on Swamy death
స్వామి మృతిపై కేటీఆర్​ ట్వీట్

By

Published : Jan 28, 2023, 10:27 AM IST

Updated : Jan 28, 2023, 5:36 PM IST

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంనకు చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తన త్రీ వీలర్ పైనుంచి కిందపడి తలకు తీవ్రగాయమై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమంలో అంశాల స్వామి పాల్గొన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ అనగానే తక్షణమే గుర్తుకొచ్చిన మరో పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ రహిత శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని ముఖ్యమంత్రి తెలిపారు.

అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. స్వామితో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. ఫ్లోరోసిస్ సమస్యపై స్వామి అవిశ్రాంతంగా పోరాడారని గుర్తు చేశారు. స్వామి మృతి పట్ల ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకట్ల సుభాశ్ సంతాపం వ్యక్తం చేశారు.

బాధితుడిగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తికై అంశాల స్వామి అనేక పోరాటాలు చేశాడు. నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు అందేవిధంగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలో కీలక భూమిక పోషించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై సుధీర్ఘ పోరాటం చేసి ఐదుగురు ప్రధానులు వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవేగౌడ, చంద్రశేఖర్‌లను కలిసి తమ కష్టాలను వినిపించారు. పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామాన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో తనలాగా ఏ ఒక్క ఫ్లోరోసిస్ బాధితుడు పుట్టకూడదని దృఢమైన సంకల్పంతో పోరాటం చేసిన అంశాల స్వామి.. ఫ్లోరోసిస్ సమస్యను ప్రపంచ స్థాయి వేదికల్లో చర్చించేలా చేశారు. స్వామికి సొంత ఇల్లు కట్టించి ఇటీవలే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. స్వామితో కలిసి భోజనం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 28, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details