తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్గతం అధ్వానం: సిమెంట్ రోడ్లు శంకుస్థాపనలకే పరిమితం - cc roads

వర్షం వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మట్టి రహదారులను సిమెంట్‌ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద సిమెంట్‌ (సీసీ) రహదారులను నిర్మించేందుకు ఈ ఏడాది మార్చి మొదట్లో నిధులు మంజూరు చేసి అదే నెల చివరికి పూర్తి చేయాలని సూచించింది. గ్రామాల్లో సమస్యలున్న మట్టి రహదారులను ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులు అనుమతులు జారీ చేశారు. పనులు ప్రారంభించిన కొద్దిరోజులకే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. పనులు ఎక్కడికక్కడ ఆగాయి. తిరిగి మళ్లీ ప్రారంభించేందుకు పంచాయతీల సర్పంచులు ముందుకు రావడం లేదు. మంజూరైన నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.  .

internal cement roads construction pending in nalgonda district
పూర్తికాని అంతర్గత సిమెంట్‌ రహదారులు.. ప్రారంభించి వదిలేశారు!

By

Published : Jul 2, 2020, 10:44 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 60-40 శాతం నిష్పత్తిలో సీసీ రహదారులకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. 60 శాతం కూలీలకు పని కల్పించి, 40 శాతం మెటీరియల్‌ కంపోనెంట్‌ కింద పనులు చేపట్టాల్సి ఉంది. అధిక శాతం గ్రామాల్లో సామాజిక వర్గాల వారీగా కాలనీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో అయిదు కంటే ఎక్కువ వీధులున్నాయి.

చాలా వీధులు రాకపోకలకు అనువుగా లేవు. వర్షం పడితే బురదమయంగా మారతాయి. ఇలాంటి వాటిని సీసీ రహదారులుగా మార్చాల్సి ఉంది. పంచాయతీ తీర్మాణాలతో సర్పంచులు ఆయా పనులను చేపట్టాల్సి ఉంటుంది. పనులు పూర్తయ్యాక నిధులను వారి ఖాతాలో జమచేస్తారు. రహదారుల నిర్మాణ పనులు గత మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

నిలిచిపోయిన పనులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 71 మండలాల్లో 1740 గ్రామ పంచాయతీల్లో మట్టి రహదారులను సీసీలుగా మార్చడానికి ప్రభుత్వం రూ.62.65 కోట్లు మంజూరు చేసింది. ఒక్కోదాని నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. పనులు పూర్తి చేసేందుకు గత మార్చి నెలతోనే గడువు ముగిసినప్పటికీ పూర్తికాని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.

25 శాతం పనులు పూర్తి
-తిరుపతయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ
ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మట్టి రహదారులను సీసీలుగా నిర్మించడానికి అనుమతించిన వాటిలో 25 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఇంకా 75 శాతం పనులు ప్రారంభించి నిలిపివేశారు. ఈ పనులు గత మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో కొంతమంది పనులు నిలిపివేశారు. పనులు పూర్తి చేసినా సకాలంలో బిల్లు అందుతుందో, లేదో అనే ఆలోచనతో కొంతమంది పనులను మధ్యలో వదిలివేశారు. దీంతో పనులు పూర్తి కావడం లేదు.

జిల్లా

కేటాయించిన నిధులు

(రూ. కోట్లలో)

చేపట్టాల్సిన పనులు పూర్తయినవి మధ్యలో ఆగిన పనులు/మొదలుకానివి
నల్గొండ 39.78 709 180 529
సూర్యాపేట 13.32 405 103 302
యాదాద్రి 9.55 350 94 256

ABOUT THE AUTHOR

...view details