నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి... వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ధాన్యం అమ్ముకునే ఈ సీజన్లో చేతికందిన పంట కాస్తా కళ్లముందే వర్షార్పణమై... అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
నీటమునిగిన వరి.. తడిచిన పత్తి
24గంటలుగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లా పానగల్ బైపాస్ వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరి... రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి రాకపోకల్ని క్రమబద్ధీకరించారు. వీటీ కాలనీ, క్లాక్ టవర్ సహా పలు కాలనీలు సహా లోతట్టు ప్రాంతాలు నదుల్ని తలపించాయి. మిర్యాలగూడ-హైదరాబాద్ దారిలోని నిడమనూరు మండలంలో తాత్కాలిక వంతెన దెబ్బతినడంతో... ఆ మార్గంలో వెళ్లే వాహనాల్ని నల్గొండ మీదుగా దారి మళ్లిస్తున్నారు. అనుముల, పెద్దవూర, తిరుమలగిరి మండలాల్లో 1,238 ఎకరాల్లో పత్తి, 130 ఎకరాల్లో వరి... నిడమనూరు మండలంలో 1500 ఎకరాల్లో పత్తి పనికిరాకుండా పోయింది.
నకిరేకల్లో ఎటు చూసినా నీరే..
దేవరకొండ, డిండి, కొండమల్లేపల్లి మండలాల్లో 487 ఎకరాల్లో పత్తి, 75 ఎకరాల్లో వరి నేలకొరిగింది. నకిరేకల్లో... తహసీల్దార్ కార్యాలయం, మినీ స్టేడియం, కోర్టు ఆవరణ, పౌరసరఫరా గిడ్డంగిలో నీరు చేరింది. మునుగోడు నియోజకవర్గంలో పత్తి పంటపైనే ఆధారపడ్డ వందలాది మంది రైతులు... తెల్ల బంగారాన్ని కోల్పోయి అప్పుల పాలవుతున్నారు.
మూసీ గేట్లు ఎత్తిన అధికారులు
సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. మూసీ జలాశయానికి వస్తున్న వరద వల్ల... 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన నాలా పొంగిపొర్లుతుండటంతో... చర్చి కాంపౌండ్, తేజ టాకీస్ పరిసరాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదనీరు వెళ్లేందుకు వీలుగా పుల్లారెడ్డి చెరువు శివారులో... నాలా గోడల్ని పురపాలిక సిబ్బంది కూల్చివేశారు. పట్టణ శివారు ప్రాంతాలైన ప్రియాంక కాలనీ, తిరుమల నగర్, శ్రీరాం నగర్, వినాయక నగర్, మానస నగర్లో... ఇళ్ల చుట్టూ వరద చేరింది.