నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో సీసీఐ సహకారంతో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈసారి వర్షాల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, మిగిలిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని కేంద్రానికి వస్తే అధికారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం అధికంగా ఉందని చెప్పి పత్తిని కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరిట పత్తిని తీసేస్తున్నారని వాపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్న పత్తినే కొనుగోలు చేయాలని ఉంది. ఈ నేపథ్యంలో పత్తి లోడు ట్రాక్టర్ బోరెం పై భాగంలో కాకుండా కింది భాగంలో అధికారులు తేమశాతం చూస్తున్నారు. దీంతో కింది భాగంలో తేమ శాతం అధికంగా వస్తుండటంతో దానిని సాకుగా చూపి మద్దతు ధరను ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు.
వివరాల నమోదు లేదు
మొదటి పింజరకం పత్తికి రూ. 5,825గా, రెండవ పింజరకానికి రూ. 5,775 గా, తేమ శాతం 10 నుంచి 12 వరకు ఉండే మూడవ పింజరకం పత్తికి రూ. 5,725 గా ధరలను నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ధర ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. కాగా స్థానిక సీసీఐ కేంద్రాల్లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు పండించిన పంట వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఎక్కడా ఆ విధంగా జరగడం లేదు. దీనివల్ల రైతుల పంట వివరాలు అంతర్జాలంలో లేకపోవడంతో మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే అవకాశాన్ని రైతు కోల్పోతున్నాడు.
అధికారుల అలసత్వం
దామరచర్లలో ఓ రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేయగా దానిని అమ్ముకోవడానికి కేంద్రానికి వెళ్తే ఆన్లైన్లో ఆ రైతు వరి సాగు చేసినట్లుగా ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు నిర్లక్ష్యంగా పని చేయడం వల్లనే తనకీ పరిస్థితి వచ్చిందని వాపోతున్నాడు.