చేను ఏపుగా పెరిగింది.. కంకులు తలలు వాల్చి నేలచూపులు చూస్తున్నాయి.. గింజల బరువును ఎప్పుడు దించుకోవాలా అని ఎదురుచూస్తున్నాయి. రైతు కూడా అంతే.. విరగ్గాసిన పంటను వెంటనే కోసి అమ్మి నాలుగు పైసలు కళ్ల చూడాలని ఆశపడుతున్నాడు. అంతలోనే వాతావరణం మారిపోయింది..
ఆకాశమంతా నల్ల మబ్బులు.. వర్షాలు.. ఇంకా ఆగితే, గింజలు నేలరాలిపోతే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఎన్ని తిప్పలు పడైనా పంట కోసి కుప్ప నూర్చారు.. బళ్లకెత్తించి బండెనక బండి కట్టి జాతరలా కదిలారు. తీరా చూస్తే అధికారుల మధ్య సమన్వయలోపం.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం..
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారిపోవడంతో రైతన్నలు అందోళనకు దిగారు.
సూర్యాపేట జిల్లా నుంచి నల్గొండలోకి ప్రవేశించే నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ధాన్యం ట్రాక్టర్లను నల్గొండ జిల్లా పోలీసులు అడ్డుకోవడంతో రెండు కి.మీ. మేర నిలిచిపోయాయి. మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నం తర్వాత కదలిన అధికారులు ఇక్కడ నిలిచిపోయిన ట్రాక్టర్లకు టోకెన్లు ఇచ్చి మిర్యాలగూడలోని మిల్లులకు పంపించారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి ఇదే పరిస్థితి తలెత్తడంతో రాత్రి వరకు వందల సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. రెండు జిల్లాల పోలీసు అధికారుల మధ్య సమన్వయ లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడురోజుల నుంచి సూర్యాపేట, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నా సూర్యాపేట జిల్లా ఉన్నతాధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసినా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టోకెన్ల కోసం పడిగాపులు
ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకోవడానికి రెండురోజులుగా మిర్యాలగూడ, నేరేడుచర్ల, వేములపల్లి మండలాల్లోని రైతు వేదికల వద్ద అధికారులు అన్నదాతలకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. మిర్యాలగూడతో పాటు వేములపల్లి, మాడ్గులపల్లి, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్ ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ట్రాక్టర్లు మిల్లులకు పోటెత్తుతున్నాయి. మూడు రోజులకు గాను అధికారులు 2,400 టోకెన్లే పంపిణీ చేయాలని నిర్ణయించడంతో సమస్య మొదలైంది. రైతు వేదికల వద్ద ఎలాంటి సదుపాయాలూ లేక అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. మహిళలైతే తాగునీరు కూడా లేక అల్లాడిపోయారు. వర్షం వస్తే తడిసిపోతుందని, ఆలస్యమైతే ట్రాక్టరు కిరాయి పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు.
దీపావళి తర్వాతే అంటున్న మిల్లర్లు