కొద్ది నెలల క్రితం జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ప్రధానాంశంగా నిలిచిన నెల్లికల్ లిఫ్టు... సాంకేతికపరమైన అనుమతుల కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు కాగా... తుది దశగా పేర్కొనే సాంకేతికపరమైన అనుమతుల కోసం అధికారులు వేచిచూడాల్సి వస్తోంది. ఈ రెండు ప్రక్రియలు ముగిసిన తర్వాతే... టెండర్లు పిలుస్తారు. నెల్లికల్ ఎత్తిపోతలను ఏడాదిన్నరలోపు పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తానని... సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. అటు సీఎం కూడా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని హాలియా సభలో అన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు వెంటనే మోక్షం లభిస్తుందని ఆయకట్టదారులు ఆశతో ఉన్నారు. ఇదే క్రమంలో జూన్ కల్లా టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. దీనిపై గత మే నెలలోనే ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏయే గ్రామాల నుంచి నీటి సరఫరా జరగాలన్న దానిపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి అంచనాలు తయారు చేశారు. నీటి సౌకర్యం లేని పల్లెలన్నింటికీ నెల్లికల్ ద్వారా జలాల్ని చేరవేయాలన్న భావనతో పథకానికి రూపకల్పన చేశారు.
పాత పథకానికి పదింతలు...
నెల్లికల్ ఎత్తిపోతల పథకం అంచనాలు పదింతలు పెరిగాయి. గత ఫిబ్రవరి 10న ఈ పథకానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్.. ఈ పథకం శరవేగంగా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇంతకుముందున్న 4,400 ఎకరాల ఆయకట్టుతో చేపట్టాల్సిన లిఫ్టునకు గాను గతంలోనే ఒక ఏజన్సీకి టెండర్లు అప్పగించగా... వాటిని రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టును 4,400 నుంచి 24,886 ఎకరాలకు... రూ.78 కోట్లున్న వ్యయ అంచనాలను రూ.703 కోట్లకు పెంచింది. ప్రతి రోజు 370 క్యూసెక్కుల చొప్పున 3.8 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు ఆహ్వానిస్తారు.
సాగర్ వెనుక జలాల వద్ద రెండు పంపులు