తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2022, 6:51 AM IST

ETV Bharat / state

వచ్చే ఏడాది యాదాద్రి వెలుగులు.. రేపు పనులు పరిశీలించనున్న సీఎం

Yadadri Thermal Power Station : యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్​ సోమవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి నిర్మాణ పనులపై రాష్ట్ర జెన్‌కో పురోగతి నివేదికను అందజేసింది.

Yadadri Thermal Power Station
Yadadri Thermal Power Station

వెలుగులు పంచేందుకు సిద్ధమైన యాదాద్రి విద్యుత్‌ కేంద్రం.. పనులు పరిశీలించిన సీఎం

Yadadri Thermal Power Station : నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 29 వేల 992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండర్‌ను భెల్‌ సంస్థ దక్కించుకుంది. ఇందులో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరు కల్లా ప్రారంభిస్తామని జెన్‌కో వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024 లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. విద్యుత్‌ కేంద్రం మొత్తం నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకటీ, రెండు ప్లాంట్లలో ఇంకా ఎక్కువ శాతం జరిగాయి.

రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇది. తొలుత కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్త ప్లాంటును రికార్డుస్థాయిలో 48 నెలల్లో నిర్మించి విద్యుదుత్పత్తిని జెన్‌కో ప్రారంభించింది. ఆ తరవాత భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద 1080 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మరో ప్లాంటును భద్రాద్రి పేరుతో చేపట్టి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ వరుసలో మూడో ప్లాంటు యాదాద్రి పేరుతో దామెరచర్ల వద్ద చేపట్టింది.

దీని నిర్మాణాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వ అంచనా వేస్తోంది. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్‌కోకు సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడానికి ఈ నెల 28న వస్తానని ముఖ్యమంత్రి చెప్పడంతో జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్​ కూడా వచ్చే అవకాశం ఉందని ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్‌ కేంద్రం కీలకమని, దీని నిర్మాణపనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. దీనికిచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం ఆపాలని ఎన్​జీటీ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details