వెనుకబడిన గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద నిధులు రానున్నాయి. అభివృద్ధి పరంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ, చందంపేట, కోదాడ, సాగర్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, తండాలు వెనుకబడి ఉన్నాయి. సమకూరే నిధులను ఆయా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ఉపయోగించుకోవచ్చు. వీటిని తగిన రీతిలో ఉపయోగించుకుంటే గ్రామీణ వికాసం వెల్లివిరుస్తుంది. ముద్ర శిశు రుణాల కింద రూ.50 వేల రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులకు రెండు శాతం వడ్డీని మాఫీ చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ముద్ర రుణాలు తీసుకున్నవారు: 1.60 లక్షల మంది
వర్షాకాలంలోనూ ఉపాధి
కరోనా దెబ్బతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మరిన్ని రోజులు పనులు కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉపాధి పనులకు వెళ్లే వారికి రానున్న వర్షాకాలంలోనూ ఉపాధి దొరకనుంది. లాక్డౌన్ కంటే ముందు రూ.182 ఉన్న దినసరి కూలీని ఇటీవలే రూ.237కు పెంచారు. ఈమధ్యే ఉపాధి కూలీల సంఖ్య పెరిగింది.
కేంద్రం తీసుకున్న చర్యలవల్ల మరింతమంది జాబ్కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ చర్యలతో ఈసారి వలసలు తగ్గవచ్చు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు ఇంటిబాట పట్టారు. వీరంతా స్థానికంగా జాబ్కార్డుల ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.
- ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలు: 11.08 లక్షలు
- వలస కూలీలు అధికంగా ఉన్న ప్రాంతాలు: మునుగోడు, నాంపల్లి, దేవరకొండ, పీఏపల్లి, పెద్దవూర, ఆలేరు, రాజపేట, బొమ్మలరామారం, చందంపేట
- వలస వెళ్లే ప్రాంతాలు: హైదరాబాద్, ముంబయి, పుణె, సూరత్, ధారావి
రేషన్ రాని వారికీ లబ్ధి
ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో ఈ ఏడాది 13,019 మంది రేషన్ కార్డులను కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 5,310 మంది నల్గొండ జిల్లా వాసులే. వీరందరికీ నెలనెల రేషన్ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం ఆర్థికమంత్రి కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.
ఇన్నాళ్లూ రేషన్ కోల్పోయిన 13 వేల మంది ఇకపై లబ్ధిపొందనున్నారు. అలాగే కార్డులేని వలస కూలీలు కూడా తమ కోటాను ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇందులో కేంద్రం తరఫున ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఇవ్వనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి దేశంలో ఏ ప్రాంతంలోనైనా నిత్యావసర వస్తువులు పొందేలా విధివిధానాలు రూపొందించనున్నారు. వచ్చే మార్చికి ఈ ప్రక్రియను వందశాతం పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
రేషన్ కార్డు దారుల సంఖ్య
నల్గొండ జిల్లాలో..: 4.58 లక్షలు
సూర్యాపేట..: 3.16 లక్షలు
యాదాద్రి..: 2.08 లక్షలు