నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని యాదిరెడ్డిపల్లి ప్రజలు.. వానాకాలం వచ్చిందంటే చాలు నానా అవస్థలు పడుతున్నారు. చెరువు నిండి అలుగుపారినా, ఎగువ నుంచి వరద వచ్చినా.. యాదిరెడిపల్లి- తాడూరు మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ గ్రామానికి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇంద్రకల్ చెరువు అలుగు పారి యాదిరెడ్డిపల్లికి వరదనీరు చేరే క్రమంలో యాదిరెడ్డిపల్లి- ఇంద్రకల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
తప్పని అవస్థలు
ఈ రెండు అలుగులు ఒకేసారి పారినా... ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తినా... యాదిరెడ్డిపల్లి జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లే! గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే కష్టాలు ఉండేవి. కానీ ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రెండు చెరువులను నింపుతున్నారు. దీంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే గ్రామస్థులకు అవస్థలు తప్పడంలేదు.
నిత్యం ప్రమాదాలు
యాదిరెడ్డిపల్లికి ఎగువన ఉన్న తుమ్మల సూగూరు, ఏటిదరిపల్లి, సిరిసనూరు, పాపగల్ గ్రామాల ప్రజలు తాడూరుకు వెళ్లాలంటే యాదిరెడ్డిపల్లి నుంచే వెళ్లాలి. చెరువు నిండి అలుగు పారితే.. ఆ గ్రామాలకు మండల కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. గతంలో ఈ వాగులో కొట్టుకుపోయి కొంతమంది మృత్యువాత పడిన ఘనటలూ ఉన్నాయి. నిత్యం చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.