అక్కడ చదువొక్కటే కాదు వంటావార్పూ నేర్పిస్తారు. యోగా, వ్యాయామం, నృత్యాలు, ఆట-పాటలు అన్నీ ఆ విద్యార్థుల దినచర్యలో భాగమే. అదే నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి శివారులోని అక్షరవనం. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న విద్యాబోధన చేస్తున్నారు. కలాం-100 పేరిట నడుస్తున్న కార్యక్రమంలో భాగంగా 60 మంది పిల్లలు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వారికి విద్య, వసతి, భోజనం అన్నీ ఉచితమే. అక్కడ సీనియర్లే గురువులు.
ఒక్కో బృందం ఒక్కో పని
అక్షరవనంలో విద్యార్థులు ఎవరి పనివారే చేసుకుంటారు. వంట కూడా విద్యార్థులే చేస్తారు. అందుకోసం బృందాలుగా ఏర్పడి పని విభజన చేసుకొని పూర్తి చేస్తారు. పాత్రలు శుభ్రం చేసేందుకు ఓ బృందం. సరుకులు తూకం వేసే బాధ్యత మరో బృందానిది. కూరగాయలు ఓ బృందం కోస్తే... వాటిని వండటం ఇంకో బృందం పని. ఇలా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం విద్యార్థులే వండి వారుస్తారు.
అంతా లెక్క ప్రకారమే..
వంట చేసేందుకు అక్షరవనంలో ప్రత్యేక మెనూ ఉంటుంది. ఏ వంటకు ఏ వస్తువులు ఎంత పరిమాణంలో జాబితా సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు ఒకరికి సరిపోయే పప్పుకూర చేయాలంటే కావాల్సిన వస్తువుల జాబితా సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారం ఎంత మందికి వంట చేయాలో హెచ్చించి వండుతారు. ఎంతమందికి కావాలో రెండు గంటల ముందు చెబితే సిద్ధం చేస్తారు. అలా అని రోజు అవే వంటలో, ఒకటి రెండు రకాలో కాదు. రోజుకో వెరైటీ అల్పాహారం, భోజనంలో కూర, చారు, పచ్చడి, పెరుగు ఇలా