Mango Crop Loss: నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో సాగుచేసే బేనిషాన్ రకం మామిడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. బహిరంగ మార్కెట్లోనూ కొల్లాపూర్ మామిడికి మంచి డిమాండ్ ఉంది. అయినా.. మూడేళ్లుగా కొల్లాపూర్ మామిడి రైతులు తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా మామిడి దిగుబడి బాగా వచ్చినా.. కొవిడ్ ఆంక్షల కారణంగా డిమాండ్ పడిపోయింది. ధర అంతంత మాత్రంగానే పలికింది. రెండేళ్లుగా నష్టాలను చవిచూసిన రైతులు.. ఈ ఏడాదైనా కలిసి వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ.. మామిడిని ఆశించిన తామర పురుగు కన్నీళ్లనే మిగిల్చింది.
నిలవని పూత... పిందే..: సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో మామిడి పంట పూత పడుతుంది. మార్చి నాటికి కాయలు కాసి.. ఏప్రిల్, మే మాసాల్లో కోతకు వస్తాయి. ఈసారి మాత్రం పూత ఆలస్యమైంది. జనవరి వరకూ పూతే లేదు. ఆ తర్వాత చెట్టు నిండా పూత వచ్చినా.. అది నిలవలేదు. తెల్ల, నల్లని తామర పురుగులు ఆశించడంతో 90 శాతం పూత రాలిపోయింది. పూత పిందెగా మారినా.. వాటి పరిస్థితి కూడా అంతే. కొల్లాపూర్లోని ఏ మామిడి తోటను చూసినా ఇదే దుస్థితి.
డిమాండ్ ఉన్నా.. దిగుబడి లేదు..: కొల్లాపూర్ డివిజన్లో 9,900 మంది రైతులు 22 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తుండగా.. అందులో 15 వేల ఎకరాల వరకు మంచి దిగుబడినిచ్చే తోటలున్నాయి. అయితే 50 శాతానికి పైగా కౌలు రైతులే తోటల్ని లీజుకు తీసుకుని సాగు చేస్తుంటారు. జనవరిలోనే కొల్లాపూర్ తోటల్లో తామర పురుగును గుర్తించారు. వాటి నివారణ కోసం ఎకరాకు 10 వేల వరకూ ఖర్చుచేసి పురుగు మందులు పిచికారి చేశారు. అయినా.. ఫలితం మాత్రం కనిపించలేదు. పురుగు నియంత్రణలోకి రాకపోవడం వల్ల రైతులు కూడా ఏమీ చేయలేక అలాగే వదిలేశారు. చూడటానికి చెట్లన్ని పచ్చగా నిగనిగలాడుతున్నా.. దిగుబడి పావుశాతం కూడా లేదు. పురుగు ఉద్ధృతిని నివారించేందుకు.. ఈసారి పెట్టుబడులు సైతం ఎక్కువే పెట్టారు. రెండేళ్లుగా కరోనా కారణంగా దెబ్బతిన్న రైతులు.. ఈ ఏడాది కౌలు డబ్బులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో మామిడి ధర టన్నుకు లక్ష పలుకుతున్నా.. అమ్మడానికి పంటే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.