తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసరి చెరువు శిఖం.. అక్రమార్కుల వశం - kesari pond land occupied in nagarkurnool district

నాగర్​కర్నూల్​ జిల్లాగా ఏర్పడిన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇది కలిసొచ్చిన స్థిరాస్తి వ్యాపారులు చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారు. ఉన్నతాధికారులంతా జిల్లా కేంద్రంలోనే ఉన్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. చెరువులో నీటిమట్టం తగ్గడమే ఆలస్యం అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రాత్రికిరాత్రే గుట్టల్లా పేరుకుపోతున్న మట్టికుప్పలే.. కబ్జాదారుల అక్రమాలకు నిదర్శనాలు.

kesari pond land occupied in nagarkurnool district
కేసరి చెరువు శిఖం భూముల ఆక్రమణ

By

Published : Dec 19, 2020, 1:24 PM IST

నాగర్​కర్నూల్ జిల్లాలోని కేసరిసముద్రం చెరువులో కాస్త నీళ్లు తగ్గాయో లేదో ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్​ పరిధిలో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మోటార్ల మునకతో కొద్దిరోజుల పాటు నీటి సరఫరా నిలిచింది. సాగు భూములకు నీళ్లు వదలడంతో కేసరిసముద్రం చెరువులో నీళ్లు తగ్గాయి. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అక్రమార్కులు.. వెంటనే తమ ప్లాన్ అమలు చేస్తున్నారు.

కేసరి చెరువు శిఖం భూముల ఆక్రమణ

తేలడమే ఆలస్యం

ఎఫ్​టీఎల్​ పరిధిలో మునిగిపోయిన ప్లాట్లు బయటకు తేలాయి. వెంటనే చెరువు ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. చెరువులోకి మళ్లీ నీళ్లొచ్చినా.. పైకి రాకుండా అందులో మట్టి, ఇటుకలు, రాళ్లు, మొరం తీసుకువచ్చి గుట్టలుగా పోస్తున్నారు.

కేసరి చెరువు శిఖం భూముల ఆక్రమణ

మట్టిపోస్తే కఠిన చర్యలే

ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్న వాటిలో మట్టికుప్పలు తెచ్చిపోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్​కర్నూల్ నీటిపారుదల శాఖ డీఈ రమేశ్ హెచ్చరించారు. మళ్లీ మట్టికుప్పలు పోసినట్లుగా తమ దృష్టికి రాలేదని తెలిపారు. చెరువును పరిశీలించి మట్టిపోసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాలు కొని మోసపోయారు

చెరువు వెంట ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేశారని నీటిపారుదల శాఖ, పురపాలక సంఘం అధికారులు 31 మందికి నోటీసులు జారీ చేశారు. చెరువు నిండినప్పుడు కొన్ని ఇళ్లు నీటిలోనే ఉండిపోయాయి. కొన్ని చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేశారు. అలుగు నుంచి ఉయ్యాలవాడ వరకు కొన్నిచోట్ల నిర్మాణాలు జరిగాయి. చెరువు పూర్తిస్థాయిలో నింపడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయి. చెరువు వెంట చాలామంది తెలియక ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి మోసపోయారు. ఇప్పుడు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నవన్న కారణంగా ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించకపోవడం వల్ల లబోదిబోమంటున్నారు.

ఆ స్థలాలకు అనుమతులివ్వం

నాగర్​కర్నూల్, నాగనూల్​ చెరువు వెంట ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న స్థలాలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. నీటిపారుదల శాఖ చేసిన సర్వే ప్రకారం నోటీసులు ఇచ్చాం. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చెరువు నిండిన తర్వాత నీరు వచ్చి ఇబ్బందులు పడతారు. చెరువు వెంట ఇళ్ల స్థలాలు తీసుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్నవాటికి అనుమతులిచ్చే అవకాశం లేదు.

- అన్వేశ్, పురపాలక కమిషనర్, నాగర్​కర్నూల్

ABOUT THE AUTHOR

...view details