రాష్ట్రంలో కలకలం రేపుతున్న ‘తల్లిని చంపిన యువతి కీర్తి కేసు’లోనూ ఆమనగల్ పేరే వినిపిస్తుండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లా పరిధికి వచ్చే ఈ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో కీర్తికి గర్భస్రావం చేసినట్టు తెలుస్తోంది. 20 మందికి పైగా ఆర్ఎంపీలు అనుమతి లేకుండా ఇక్కడ ఆసుపత్రులు నడిపిస్తున్నారు. వీరు యథేచ్ఛగా లింగ నిర్ధారణ సైతం చేస్తున్నారు.
ఒక్కో కేసుకూ ఒక్కో ధర!
పూర్తయిన నెలలను బట్టి గర్భస్రావం చేసేందుకు ఈ ఆస్పత్రుల నిర్వాహకులు ధరలు నిర్ణయిస్తారు. గర్భం రెండు మూడు నెలలలోపు ఉంటే రూ.50వేల నుంచి రూ.70వేల వరకు, నాలుగు నుంచి ఆరు నెలల గర్భం ఉంటే రూ.లక్ష-లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. ఈ కేసుల్లో ప్రధానంగా మగపిల్లలు కావాలనుకొని ఆడపిల్లలు పుట్టిన దంపతులు, పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతులు, మైనర్లే ఎక్కువగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు వారు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలోనూ గుంజుతున్నారు.
మూడేళ్ల కిందటిదాకా ఇలాంటి గర్భస్రావాలు చేసేందుకు పొరుగునున్న దేవరకొండ, మాల్ ప్రాంతాల పేర్లు వినిపించేవి. ఇప్పుడు ఆమన్గల్ కేంద్రంగా మారింది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట, నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతాల్లో ఉండే కొందరు ఆర్ఎంపీలు అబార్షన్ల కేసులను పరిష్కరించేందుకు ఆమన్గల్ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ప్రభుత్వపరంగా లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావాలపై నిషేధం ఉన్నందున హైదరాబాదు నగరంలో, ప్రధాన పట్టణాల్లో వైద్యులు ఇలాంటి కేసులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వాటన్నింటిని ఆమన్గల్కు పంపుతున్నారు.
మూడేళ్ల కిందట ఆమన్గల్లో బాగా పేరున్న ఓ ఆసుపత్రిలో వరుసగా గర్భస్రావం కేసులు వికటించాయి. ఏకంగా ఎనిమిది మంది మహిళలు మృత్యువాత పడటంతో ఆ వైద్యుడు బాధిత కుటుంబాలకు భారీగా డబ్బులిచ్చి రాజీ చేసుకొన్నాడు. ఆసుపత్రి మూసుకొని వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇలా ఆర్ఎంపీలు శస్త్రచికిత్సలు చేస్తున్నా, గుర్తింపు లేకుండా ఆసుపత్రులు నడుస్తున్నా, యథేచ్ఛగా లింగ నిర్ధారణలు చేస్తున్నా వైద్యశాఖ అధికారులెవరూ ఆమన్గల్ వైపు దృష్టిపెడితే ఒట్టు!