చింతలపల్లి ఎక్స్ప్రెస్ ఎక్కితే గురుకుల సీటు ఖాయం అది నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. విద్యార్థులంతా నిరుపేదలే! అయితే ఆ బడికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతిఏటా గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధిస్తూ అబ్బురపరుస్తున్నారు. దీని వెనుక అంకితభావంతో పని చేసే ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు. అంతకుమించి వినూత్నంగా పాఠాలు బోధించే ఉపాధ్యాయులున్నారు. చింతలపల్లి ప్రభుత్వ పాఠశాల గురించి తెలుసుకున్న గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు మరింత నాణ్యమైన విద్య కోసం సొంతంగా డబ్బులు సమకూర్చి విద్యా వలంటీర్లను నియమించారు.
సాధారణ బడి.. రైలులా మారిందిలా..
చింతలపల్లి పాఠశాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి... ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తున్న తీరును హర్షించారు. పాఠశాల అభివృద్ధికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో పాఠశాలను వినూత్నంగా రైలు ఆకారంలో తీర్చిదిద్దారు. తరగతి గది గోడలకు ఆకర్షణీయమైన బొమ్మలు వేశారు.
అహ్లాద వాతావరణానికి కేరాఫ్ అడ్రస్..
ఈ ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు చక్కని వాతావరణాన్ని కల్పిస్తూ.. గురుకుల పాఠశాలలు ఎంపికయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 78 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. 2012-13 సంవత్సరంలో నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా... గత విద్యాసంవత్సరంలో 16 మందికి అవకాశం లభించింది.
ఏటా గురుకులాలకు ఎంపికవుతున్న తీరు చూసి హైదరాబాద్ నుంచి సైతం ఇక్కడకు విద్యార్థులను పంపుతున్నారు తల్లిదండ్రులు. వలస వెళ్ళిన వారి పిల్లలు కూడా అదే బడికి పంపిస్తున్నారు.
సృజనాత్మకతను పెంచే ఆటలు...
పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, ఆటలు, పాటలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలోని నలుగుగు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు తీసుకొని బోధిస్తున్నారు. చింతలపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లాలో ఉత్తమ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నారు.