రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. ఖరీఫ్ సీజన్ 2019- 20 వరి పత్తి కొనుగోలుపై నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతి, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. పంటల కొనుగోలులో రైతు సమన్వయ సమితి సభ్యులు కీలకంగా వ్యవహరించాలని బాలరాజు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. గన్నీ బ్యాగుల సరఫరా పకడ్బందీగా జరగాలన్నారు. ప్రతి ఐకేపీ కేంద్రానికి మండలానికి ఒకరు చొప్పున అధికారులను నియమించాలని అధికారులకు ఆదేశించారు.