తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు ఆదివాసులకు తప్పని తిప్పలు

అడవితో ఆదివాసుల అనుబంధం విడదీయరానిది. పుట్టుక నుంచి చనిపోయే దాకా అడవి తల్లితో మమేకమై ఆనందంగా గడుపుతారు. పూలు, పండ్లు, ఆకులు ఏరుకొని జీవనం సాగిస్తారు తప్ప నగరం వైపు రారు. ఒకవేళ రావాల్సి వచ్చినా... ఇక్కడి ప్రజలతో కలిసిపోలేరు.

By

Published : Mar 28, 2019, 2:39 PM IST

ములుగు ఆదివాసులకు తప్పని ముప్పుతిప్పలు

ములుగు ఆదివాసులకు తప్పని ముప్పుతిప్పలు
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో 16 ఏళ్లుగా గుత్తి కోయలు జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితమే ఛత్తీస్​గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. వసంత రుతువు నుంచి శిశిర రుతువు వరకు విప్ప పూలు, అనంతరం తునికాకు, అప్పుడప్పుడూ పండ్లు, పూలు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సర్కారు కరుణించడం లేదు

అడవి బిడ్డలైన ఆదివాసులను సర్కారు కరుణించడం లేదు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పించిన ప్రభుత్వం కనీస సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదు. అంతేకాదు అడవిపైనే ఆధారపడి జీవిస్తున్న వీరిని అడవి వదిలి వెళ్లిపోవాలంటూ ఇబ్బంది పెడ్తున్నారు అటవీశాఖ అధికారులు. పోడు వ్యవసాయం నివారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు పోలీసులు పొద్దున నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్​లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన తమకు తెలుగు భాష రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక అడవిలో చెలమల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు వేధించకుండా చూడాలని గుత్తికోయ గిరిజనులు వేడుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో బతకలేక ఇక్కడకు వస్తే తమతో ఇలా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు.

ఇవీ చదవండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

ABOUT THE AUTHOR

...view details