Medaram Jatara 2022 : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం వేలాదిగా తరలి వస్తున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతా నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్ల దర్శనంతో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ట్రైబల్ సర్క్యూట్గా
పలువురు ప్రజాప్రతినిధులు మేడారానికి తరలివచ్చి.. అమ్మలను దర్శించుకుంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి రేణుసింగ్ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకముందు కిషన్రెడ్డి.. నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు. అనంతరం దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీక అని కిషన్రెడ్డి అన్నారు. 45 కోట్లతో ములుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే పనులు పూర్తిచేస్తామని చెప్పారు. మేడారం పరిసర ప్రాంతాలు ట్రైబల్ సర్క్యూట్గా అభివృద్ధి చేస్తామని అన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలి
మేడారం సమ్మక్క-సారలమ్మను మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని అమ్మవార్లను మొక్కుకున్నానని మంత్రి తెలిపారు. గతంలో తాను కోరిన కోర్కెలను అమ్మవార్లు నెరవేర్చారని చెప్పారు. అమ్మ వార్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవిత, బండ ప్రకాశ్ సహా పలువురు నాయకులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం జాతర సవ్యంగా సాగుతోందని తెలిపారు.