తెలంగాణ

telangana

ETV Bharat / state

ల్యాండ్​ సెటిల్​మెంట్లు... కోట్లలో లంచాలు... ఈ తిమింగలానికి ఆకలెక్కువే! - keesara news

'రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే' ఇది గత కొన్నాళ్లుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెబుతున్న మాట. ఆయన ఎందుకిలా అంటున్నారో సామాన్యులకు సులువుగానే అర్థమైపోతోంది. కానీ కొందరు అధికారుల చెవులకు మాత్రం ఎక్కడం లేదు. పదే పదే అవినీతికి పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా కీసర తహసీల్దార్‌ ఏకంగా కోటీకిపైగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు.

vro acb case updates and full story in detail in telugu
vro acb case updates and full story in detail in telugu

By

Published : Aug 15, 2020, 4:29 AM IST

అవినీతి నిరోధకశాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. ఓ ప్రభుత్వాధికారి ఏకంగా కోటి రూపాయలకుపైగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితులెవరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా అనిశా అధికారులే నిఘా పెట్టి... కీసర తహసీల్దార్‌ నాగరాజును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతడ్ని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ రాజకీయ నేత అనుచరుడు, స్థిరాస్థి దళారి, వీఆర్​ఏను ఈ వ్యవహారంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో 53ఎకరాల భూమిపై గత కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే రైతుల తరఫున కీసర తహసీల్దార్ నాగరాజును స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్‌, అంజిరెడ్డి సంప్రదించారు. భూ వ్యవహారాన్ని తమకనుకూలంగా సెటిల్ చేయమని వారు కోరారు. సమస్య పరిష్కారానికి తహసీల్దార్‌ 2 కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడు. అందుకు స్థిరాస్తి దళారులు ఒప్పుకుని ఎఎస్​ రావు నగర్‌లోని అంజిరెడ్డి బంధువుల ఇంటికి నాగరాజును పిలిపించుకున్నారు. తహసీల్దార్ నాగరాజు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నాడనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టారు. నాగరాజు అడ్వాన్స్‌గా కోటి 10లక్షల రూపాయలకుపైగా లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మొత్తం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు... తహసీల్దారుతో పాటు రియల్టర్లు శ్రీనాథ్‌, అంజిరెడ్డి, రాంపల్లి గ్రామ వీఆర్​ఏ సాయిరాజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అల్వాల్‌లోని తహసీల్దార్ నాగరాజు ఇంట్లోనూ అధికారులు తనిఖీ చేసి... భారీగా బంగారం, 28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. నాగరాజుకు సంబంధించిన బ్యాంకు లాకర్లు, ఖాతాలను పరిశీలిస్తామని అనిశా అధికారులు తెలిపారు.

నాగరాజు గతంలోనూ భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కరించేందుకు డబ్బు డిమాండ్ చేశాడా।? ఫిర్యాదు చేసేందుకు బయటకు రాని బాధితులెవరైనా ఉన్నారా? తహసీల్దార్‌తో పాటు దళారుల వెనక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

ABOUT THE AUTHOR

...view details