తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకరి మృతదేహానికి మరో కుటుంబం అంత్యక్రియలు - హైదరాబాద్​లో మారిన కరోనా మృతదేహం

ఉస్మానియా ఆసుపత్రి, బల్దియా సిబ్బంది నిర్వాకం.. మృతదేహం గుర్తింపులో తడబాటు కారణంగా ఒక మృతదేహానికి బదులు మరోదాన్ని తీసుకెళ్లింది ఓ కుటుంబం... అంత్యక్రియలను కూడా పూర్తిచేసింది. సదరు మృతుడి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో విషయం బయటపడింది. ఇరువర్గాలను పోలీసులు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

COVID 19
COVID 19

By

Published : Jul 12, 2020, 8:45 AM IST

మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి (64), అల్వాల్‌కు చెందిన వ్యక్తి (48) శుక్రవారం కొవిడ్‌తో గాంధీలో మృతి చెందారు. ఆ ఆసుపత్రి పరిధిలో వచ్చే మృతుల పోస్ట్‌మార్టం సైతం ఉస్మానియా మార్చురీలోనే నిర్వహిస్తున్నారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం అల్వాల్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని దూరం నుంచి చూసిన పేట్‌బషీరాబాద్‌ వారు.. తమ కుటుంబ సభ్యుడిది అనుకొని తీసుకెళ్లి ఎర్రగడ్డలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.

శనివారం అల్వాల్‌ మృతుడి అసలు కుటుంబీకులు వచ్చి మృతదేహం కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసులు పేట్‌బషీరాబాద్‌ వారిని పిలిపించారు. వారు వచ్చి మృతదేహం తాలుకూ ఫొటో చూపెట్టడంతో అల్వాల్‌ వారు ఇది తమ కుటుంబీకుడిదిగా గుర్తించారు. పేట్‌బషీరాబాద్‌ వారు పొరపడినట్లు తెలుసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌ పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

అప్పటికే అల్వాల్‌ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తికావడంతో... శనివారం నిర్వహించిన పేట్‌బషీరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతదేహ అంత్యక్రియల్లో ఇరు కుటుంబాలూ పాల్గొన్నాయి. దీనిపై ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డా.సఫీయుద్దీన్‌ వివరణ ఇస్తూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. గాంధీ సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details