తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.లక్షలు ఖర్చు చేశారు.. లక్షణంగా వదిలేశారు.. - మెదక్​ జిల్లా తాజా వార్తలు

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని 11 గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు మంజూరు చేసిన రెండు విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం రూ.3 కోట్లు మంజూరు చేసి మండలంలోని ఉప్పులింగాపూర్‌, అందుగులపల్లి గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన రెండు ఉపకేంద్రాల్లో ఒకటి నిర్మాణం పూర్తయి ఏడాదిగా నిరుపయోగంగా ఉండగా, మరొకటి అసంపూర్తిగా దర్శనం ఇస్తోంది.

రూ.లక్షలు ఖర్చు చేశారు.. లక్షణంగా వదిలేశారు..
రూ.లక్షలు ఖర్చు చేశారు.. లక్షణంగా వదిలేశారు..

By

Published : Jul 22, 2020, 4:24 PM IST

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలోని 11 గ్రామాలకు విద్యుత్తు సరఫరా మెరుగు పరచేందుకు మంజూరు చేసిన రెండు విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మూడేళ్ల క్రితం రూ.3 కోట్లు మంజూరు చేసి మండలంలోని ఉప్పులింగాపూర్‌, అందుగులపల్లి గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన రెండు ఉపకేంద్రాల్లో ఒకటి నిర్మాణం పూర్తయి ఏడాదిగా నిరుపయోగంగా ఉండగా, మరొకటి అసంపూర్తిగా దర్శనం ఇస్తోంది.

మండలంలో ఇప్పటికే వెల్దుర్తి, మంగళపర్తి, దామరంచ, రామాయపల్లి, నాగ్‌సాన్‌పల్లి, మాసాయిపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. వెల్దుర్తి, మాసాయిపేటలో 132/33 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అయితే మండలంలో సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ విద్యుత్తు సరఫరా కనెక్షన్లు ఎక్కువ కావడంతోపాటు త్వరలో కాళేశ్వరం నీళ్లు హల్దీవాగులోకి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయని భావించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 2018లో రెండు 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించారు.

2018 జూన్‌లో అప్పటి శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక విద్యుత్తు సమస్యలు తీరుతాయని భావించిన రెండు గ్రామాల ప్రజల ఆశలు నెరవేరలేదు.

ఏడాదిగా నిరుపయోగంగా..

ఉప్పులింగాపూర్‌, ఉప్పులింగాపూర్‌ తండా, ఎదులపల్లి, ఎదులపల్లి తండా, బండపోసానిపల్లి, చిన్నశంకరంపేట మండల పరిధిలోని కొన్ని తండాలకు విద్యుత్తు సరఫరా మెరుగు పర్చాలని ఉప్పులింగాపూర్‌లో విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగగా ఏడాది క్రితం పూర్తయ్యాయి. రామాయపల్లి, వెల్దుర్తి ఉపకేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాను తొలగించి ఉప్పులింగాపూర్‌ ఉపకేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉండగా ఏడాదిగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

ఉప్పులింగాపూర్‌ విద్యుత్తు ఉపకేంద్రం పనులు పూర్తయ్యాయి. ప్రారంభించి విద్యుత్తు సరఫరా చేయడం ఆలస్యం. అందుగులపల్లి ఉపకేంద్రం నిర్మాణం పూర్తికి కృషి చేస్తున్నాం. అక్కడ ఉపకేంద్రం నిర్మిస్తున్న స్థలం రెవెన్యూ శాఖదని ఆ శాఖ వారు ధ్రువపత్రం ఇవ్వడంతో పనులు చేపట్టాం. అదే విషయాన్ని అటవీ శాఖకు తెలిపాం. వారినుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. సమస్యలను విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

-పెంట్యానాయక్‌, మండల విద్యుత్తు శాఖ ఇంజినీరు

అందుగులపల్లిలో అసంపూర్తి నిర్మాణం..

అందుగులపల్లి, పెద్దమ్మగడ్డ తండా, మహ్మద్‌నగర్‌ తండా, మానేపల్లి, రెడ్డిగూడెం, ధర్మారం గ్రామాలకు విద్యుత్తు సరఫరా మెరుగు పర్చాలనే ఉద్దేశంతో అందుగులపల్లి వద్ద 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. దీనికి సైతం 2018 జూన్‌లోనే శంకుస్థాపన చేశారు. గుత్తేదారు పనులు ఆలస్యంగా ప్రారంభించగా అటవీ శాఖ అభ్యంతరంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. ఇక్కడ పవర్‌ నియంత్రిక ఏర్పాటు, సివిల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెండు ఉపకేంద్రాలను త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ABOUT THE AUTHOR

...view details