మెదక్ జిల్లాలో సుదీర్ఘ ఎన్నికల ఘట్టం సందర్భంగా నిరవధిక వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం నేడు తెరుచుకోగానే కన్నీటి ఘట్టానికి వేదికైంది. కన్న కుమారులే తనను పట్టించుకోవడం లేదని.. కనీసం భోజనం పెట్టడం లేదని ఓ మాతృమూర్తి కలెక్టరేట్ గడప తొక్కింది.
కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారు - మెదక్
కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారంటూ ఓ మాతృమూర్తి కలెక్టర్ ముందు కన్నీటిపర్యంతమైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత మహిళ అంజమ్మ ఫిర్యాదు చేసింది. కష్టించి నిర్మించిన ఇంటిని సైతం అద్దెకిచ్చి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని వాపోయింది. అంజమ్మ పరిస్థితిని విన్న కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు.
![కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3524671-thumbnail-3x2-anjamma.jpg)
మెదక్ పట్టణానికి చెందిన అంజమ్మకు నలుగురు సంతానం... హోటల్ నడుపుతూ కష్టసుఖాలకు ఓర్చుకుని పిల్లలను పోషించానని, ఆ సొమ్మతోనే ఇల్లు కట్టించానని అంజమ్మ తెలిపింది. కానీ తనకు అన్నం పెట్టడమే వృథా ప్రయాసగా వారు చూస్తున్నారని వాపోయింది. కష్టించి నిర్మించుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చి తనకు నిలువ నీడ లేకుండా చేశారని కలెక్టర్ ధర్మారెడ్డి ముందు కన్నీటి పర్యంతం అయింది. అంజమ్మ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన కలెక్టర్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంజమ్మ కుమారులకు కౌన్సిలింగ్ నిర్వించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధాశ్రమంలో చేర్పించాలని సూచించారు.
ఇవీ చూడండి: భిక్షాటన చేసిన సర్పంచ్... మళ్లీ నిరసన