కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన మెడికల్ కిట్లను సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. కొందరు వైరస్ లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి అన్నారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై మెదక్ కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వెయ్యి ఇళ్లకు ఒక బృందం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇంటింటికి కొవిడ్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో కరోనాను అరికట్టాలనే ఉద్దేశంతో 1000 ఇళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ సెక్రటరీ, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు ఉంటారని వెల్లడించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి ఐసోలేషన్ చేసి వారికి కొవిడ్ కిట్ ఇచ్చి చికిత్స చేయాలని సూచించారు.
ప్రస్తుతం మన జిల్లాలో లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయగా... 6120 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరందరిని ఐసోలేషన్ చేసి వారికి చికిత్స ప్రారంభించడం జరిగిందన్నారు.
తొందరపడి ప్రైవేట్కు వెళ్లొద్దు
చాలామంది కరోనా రాగానే తొందపపడి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా చికిత్స అందిస్తోందని వివరించారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మందులు, ఆక్సిజన్, రెమిడెసివిర్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి కి ప్రభుత్వానికి ప్రజల నుంచి సహకారం కావాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని.... ఎలాంటి సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు.
రెండో డోస్కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు..
జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి రెండో డోస్ ఇవ్వడం జరుగుతుందని... రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వివరించారు. మొదటి డోస్ తీసుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలన్నారు. అనంతరం మెదక్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటుచేసిన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి... లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కలెక్టర్ హరీశ్, అధికారులు పాల్గొన్నారు.
బిహార్ కూలీలు కొరత వల్లే....
బిహార్ హమాలీలు వెళ్లిపోవడం వల్లే ధాన్యం దించడంలో ఇబ్బందులొచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న హమాలీలే రైస్మిల్లులో ధాన్యాన్ని ఖాళీ చేయాలని దానికి సంబంధించిన ఛార్జీలు హమాలీలకు అప్పటికప్పుడే చెల్లించేలా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. లారీల కొరత ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలించాలని సూచించారు..