తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 11:08 AM IST

ETV Bharat / state

పోలీసుల ఆరోగ్య రేఖ ఎలా ఉంది?

కరోనా.. వ్యక్తులు.. హోదాలతో సంబంధం లేకుండా ప్రతాపం చూపుతుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రక్షకులు మాత్రం మనకు రక్షణగా.. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఠాణాలను వదిలి రహదారులకే పరిమితయ్యారు. వారి సంరక్షణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. మెదక్​ జిల్లాలో ఇటీవల ఆరోగ్య సర్వే ప్రక్రియను చేపట్టింది. లాక్‌డౌన్‌ విధులు సహా భవిష్యత్తులో ఈ సర్వే ఫలితాలు కీలకంగా మారనున్నాయి.

MEDAK POLICE DEPARTMENT TESTING POLICE HEALTH
పోలీసుల ఆరోగ్య రేఖ ఎలా ఉంది?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా పోలీసులు జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. వివిధ దశల్లో హోంగార్డు మొదలు ఎస్పీ వరకు ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మెదక్​ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధుల్లో మొత్తం 785 మంది భాగస్వాములయ్యారు. జిల్లాలో 151 మంది హోంగార్డులున్నారు. మూడు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు, ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో పికెట్లు నిర్వహిస్తున్నారు.

రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని 21 పోలీసు ఠాణాల పరిధిలో బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఆరోగ్య సర్వే ప్రక్రియను చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేకంగా https:///tinyurl.com/ts-police-covid-surveyలింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిరంతరం పని గంటల నేపథ్యంలో ఆరోగ్యంపై ఒక అవగాహన పొందేందుకు వీలుగా ఈ సర్వే ఉపయుక్తంగా మారనుంది. ఈ మేరకు సర్వే లింకులో ఆరోగ్య స్థితిని, పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అవసరమైన వారికి టెలీ-హెల్త్‌ కన్సల్టేషన్‌ లేదా తగిన చికిత్సను అందుబాటులోకి తెస్తారు. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యానికి దారితీసిన కారణాలు తెలుసుకొని నివారణ చర్యలు తీసుకోనున్నారు.

ఆరు పేజీల్లో ప్రశ్నలు

జిల్లాలో సంబంధిత వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. లింకును తెరవగానే ఆరు పేజీల్లో ప్రశ్నావళి ఉంటుంది. పేరు, వయసు, వ్యక్తిగత వివరాలు, ఆరోగ్యానికి సంబంధించి రక్తపోటు, ఆస్తమా, చక్కెర, గుండె, కాలేయ, ఛాతి, కిడ్నీ, మూత్ర, న్యూరో తదితర విభాగాల్లో ప్రశ్నలకు అనుగుణంగా వివరాలు పొందుపర్చాలి. వ్యసనాలపై ప్రశ్నించడం సహా కొవిడ్‌-19 బాధితులను కలిశారా.. అనే ప్రశ్నను పొందుపర్చారు.

సర్వే అనంతరం ఆరోగ్య వివరాల మేరకు విధులు కేటాయించేలా కసరత్తు చేయనున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లాక్‌డౌన్‌ విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఠాణాలు, కంట్రోల్‌ రూం, ఇతర విభాగాల్లో తాత్కాలికంగా బాధ్యతలు కేటాయించనున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి క్షేత్రస్థాయిలో విధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలతో జిల్లాలో నాలుగు రోజుల కిందట ప్రారంభమైన ఆరోగ్య సర్వే దాదాపు పూర్తి అయినట్టే. లింకు ఆధారంగా జిల్లాలో 798 మందికి గాను ఆదివారం ఉదయం 11 గంటల వరకు 779 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితుల్లో ఈ సర్వే కీలకంగా మారనుంది.

ఇవీ చూడండి:వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం

ABOUT THE AUTHOR

...view details