ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు వేచి చూస్తున్న పీఆర్సీ.. మోచేతికి బెల్లం పెట్టినట్లుగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లిలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
అధికారంలోకి రాగానే మెరుగైన ఫిట్మెంట్..
పీఆర్సీ.. ఉద్యోగుల కోరికల అనుగుణంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల కోసం రాజీపడి నీరు గారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే మెరుగైన ఫిట్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను ఉద్యమంలో వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరపున రాజీలేని పోరాటం చేస్తామన్న ఆయన... సీఎం కేసీఆర్ దమననీతికి నిదర్శనమని దుయ్యబట్టారు.