తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆపత్కాలంలో అతివలకు ఆర్థిక భరోసా..! - medak district latest news

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌తో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనులన్నీ స్తంభించడంతో పేద వర్గాలకు పాట్లు తప్పడం లేదు. ఈ క్రమంలోనే పొదుపు పాటించడంతో పాటు రుణాలతో ఆర్థిక స్వావలంబన దిశగా సాగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు సైతం వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్రం కొవిడ్‌-19 పేరిట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక పథకాన్ని చేపట్టడం విశేషం.

medak district SERP department latest news
medak district SERP department latest news

By

Published : May 3, 2020, 7:55 PM IST

స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు వ్యాపారాలు ప్రారంభించగా, దుకాణాలు మూతపడటంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాస్క్‌ల తయారీతో కొంత ఊరట లభించినా.. అధికశాతం మంది దీనికి దూరంగానే ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. నిరంతరం ఇచ్చే సాధారణ బ్యాంకు లింకేజీతో పాటు కొవిడ్‌-19 రుణాలను సైతం ఇస్తున్నారు. మెదక్​ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే దీనికి అంకురార్పణ జరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.

రూ.5 వేల చొప్పున..

జిల్లాలోని 20 మండలాల్లో 518 గ్రామైక్య సంఘాలు, 12,413 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 1,29,983 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం నాలుగు పురపాలికలు ఉండగా.. 1,559 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ప్రస్తుత ఆపత్కాల పరిస్థితుల్లో సంఘాల్లోని మహిళలకు రూ.5 వేల చొప్పున ప్రత్యేకంగా రుణం ఇవ్వాలని కేంద్రం ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.

ఒక స్వయం సహాయక సంఘానికి గరిష్ఠంగా రూ.లక్ష రుణం ఇవ్వొచ్చని వెల్లడించింది. స్వయం సహాయక సంఘం నాయకురాలు బ్యాంకుకు వెళ్లి పత్రాలు పూరిస్తే చాలు ఒక రోజు వ్యవధిలోనే రుణం మంజూరు చేస్తున్నారు. కొవిడ్‌-19 ఎస్‌హెచ్‌జీ టాప్‌అప్‌ రుణంగా పిలుస్తున్నారు. రుణం తీసుకున్నాక ఆరు నెలల వరకు కిస్తీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 30 నెలల్లోగా సులభ వాయిదా పద్ధతిలో నగదు చెల్లించాలి. నిర్దేశిత వ్యవధిలో చెల్లిస్తే శూన్య వడ్డీ వర్తింపజేస్తారని అధికారులు వెల్లడించారు.

ఈ ఆపత్కాలంలో కుటుంబ అవసరాలు, అత్యవసర పనులు చేసుకోవడానికి ఇది ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 38 స్వయం సహాయక సంఘాలకు రూ.1.42 కోట్లు అందజేశారు. త్వరలో 102 సంఘాలకు రూ.4.59 కోట్ల రుణాలు గ్రౌండింగ్‌ కానున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి...

సంఘం సభ్యులతో తీర్మాన ప్రతిలో సంతకాలు చేయించి బ్యాంకులో సమర్పిస్తే సరిపోతుంది. వెంటనే సభ్యుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ప్రస్తుత పరిస్థితిలో సంఘాల సభ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- భీమయ్య, అదనపు పీడీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

ABOUT THE AUTHOR

...view details