రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి.. పుష్కలంగా నీరు అందిస్తూ.. ఇప్పుడు వరి సాగు చేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కో ఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. రైతులను వరిసాగుచేయద్దంటే ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు (RS Praveen Kumar comments on the sale of grain seeds). వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామనడం దారుణమన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి... కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు నిర్మించి... ఇప్పుడు వరి సాగుచేయొద్దంటే రైతుల నోట్లో మట్టి కొట్టినట్టవుతుందని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా... వరి వేయకూడదనే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు చెరకు మిల్లులు లేవని... మక్కల పరిస్థితి దారుణంగా ఉందని.. పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ జిన్నింగ్ మిల్లులు లేవని.. రాష్ట్రంలో ఫుడ్ పరిశ్రమలు లేవని ప్రవీణ్కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్హౌస్లో ఏడాది పొడవునా... నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ ముంపు గ్రామాల్లో వందలాది ఎకరాలు నీట మునిగిపోయాయని ఇప్పటివరకు నష్టపరిహారం విడుదల చేయలేదన్నారు. మీడియా సమావేశం అనంతరం మెదక్ పట్టణంలో బహుజన సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు ఐబీ నుంచి బాలాజీ గార్డెన్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు (bsp bike rally in medak).