తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

అన్నీ తానైన భర్త ఆకస్మికంగా చనిపోయి ఆమెని ఒంటరిదాన్ని చేశాడు. కన్నీరు ఆరకముందే ఆ ఇంటి పెద్దదిక్కు మృతి చెందాడు. ఆ చేదు జ్ఞాపకాలు కళ్లలోంచి చెరిగిపోకముందే కన్నబిడ్డ కన్నుమూసింది. ఈ విషాదాల తాలూకు విషాన్ని కంఠంలో... కన్నీళ్లను దిగమింగుకుంటున్న సమయంలో తనతోపాటు తన కడుపులోని నలుసు ప్రమాదంలో ఉందని తెలుసుకొని తల్లడిల్లిపోతోంది. పక్షం రోజుల్లో మూడు తరాల వాళ్లు మృత్యవాతపడ్డారు. ప్రస్తుతం ఆ ఇల్లాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

By

Published : Oct 29, 2019, 2:30 PM IST

Updated : Oct 29, 2019, 3:54 PM IST

ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిమల్ల రాజగట్టు కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందాడు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగీతో మరణించారు.

ఇద్దరి మరణాలను తలచుకొని తలుచుకొని బాధపడుతున్న ఆ కుటుంబంలో దీపావళి రోజే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కుమార్తె ఆరేళ్ల వర్షిని నాలుగు రోజుల క్రితం డెంగీ బారిన పడి మృతి చెందింది. తాతను, భర్తను, కూతురును పోగొట్టుకున్న రాజు భార్య సోనీ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. మూడు రోజులుగా ఆమె కూడా డెంగీతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో కుమార్తె వర్షిని అంత్యక్రియలు ముగించగానే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఇప్పటికే తమ కుటుంబంలో డెంగీ బారిన పడి మూడు తరాల వాళ్లు చనిపోయారని... ఇప్పడు మరో ఇద్దరు డెంగీతో ప్రాణాల కోసం పోరాడుతున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భీష్మ, మున్సిపాలిటీ కమిషనర్ స్వరూపారాణి పరామర్శించి ఇంటి పరిసరాలను పరిశీలించారు.

ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం

Last Updated : Oct 29, 2019, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details