తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏళ్లు గడిచినా ఇల్లేదీ.. చెదిరిపోతున్న మధ్యతరగతి వారి సొంతింటి కల

Rajiv Swagruha: పట్టణ మధ్యతరగతి కుటుంబాల స్వగృహ కల చెదిరిపోతోంది. రాజీవ్ స్వగృహ కోసం సేకరించి, కేటాయించకుండా మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు అవకాశం ఇవ్వకుండా, వేలం వేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఖాళీప్లాట్ల వేలం ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్న సర్కారు... స్వగృహలో నిర్మించిన ఇళ్లకు కనీస వసతులు కల్పించడం లేదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో స్వగృహ ఖాళీ ప్లాట్ల విక్రయంపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై ఈటీవీ భారత్​ కథనం.

By

Published : Jan 28, 2022, 4:32 AM IST

ఏళ్లు గడిచినా ఇల్లేదీ.. చెదిరిపోతున్న మధ్యతరగతి వారి సొంతింటి కల
ఏళ్లు గడిచినా ఇల్లేదీ.. చెదిరిపోతున్న మధ్యతరగతి వారి సొంతింటి కల

ఏళ్లు గడిచినా ఇల్లేదీ.. చెదిరిపోతున్న మధ్యతరగతి వారి సొంతింటి కల

Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ కోసం సేకరించి, లబ్ధిదారులకు కేటాయించకుండా మిగిలిపోయిన ఇండ్లస్థలాలను, వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుండా వేలం ఎలా నిర్వహిస్తారంటూ గతంలో వాటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు, నెలవారీ కిస్తీలు చెల్లించిన వాళ్లు, ప్రస్తుతం స్వగృహలో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నవాళ్లూ అధికారులను నిలదీస్తున్నారు. మహబూబ్​నగర్ పట్టణంలో రాజీవ్ స్వగృహ కోసం 84ఎకరాల స్థలాన్ని సేకరించి 959 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. 3,840మంది వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 452 ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు కేటాయించారు. వీటిలో 124మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 304మంది లబ్ధిదారుల ఇళ్లు పెండింగ్​లోనే ఉన్నాయి. కొన్నాళ్లకు మరో 28 ఖాళీప్లాట్లను బహిరంగ వేలంతో విక్రయించారు. మిగతా ప్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వేలంపాట నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు

ఇండ్ల స్థలాల కోసం గతంలో 3వేలు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి ఇంటి స్థలం కేటాయించలేదు. అలాంటి వారికి ముందుగా కొనుగోలు చేసే అవకాశం ఇవ్వకుండా నేరుగా వేలం వేయడం ఏమిటని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వాయిదాల రూపంలో కొంతడబ్బును స్వగృహకోసం చెల్లించారు. వారికి ఇండ్ల స్థలం దక్కలేదు. అప్పట్లో చెల్లించిన సొమ్మును తిరిగి తీసుకునే అవకాశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం కల్పించింది. ఎన్నేళ్లు దరఖాస్తు చేసుకుని ఎదురుచూసిన వారికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే డబ్బులు తిరిగి ఇస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టును సైతం ఆశ్రయిస్తామని గతంలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.

వేలాన్ని అడ్డుకుంటామంటున్న కాలనీవాసులు

రాజీవ్ స్వగృహలో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న వారి నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇళ్లు కేటాయించినప్పుడు అన్నిరకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ సహా ఏ వసతీ సరిగా లేదని స్వగృహ టౌన్​షిప్ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో 28 ఇండ్లస్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారని వచ్చిన డబ్బుతో ఎలాంటి వసతులు కల్పించలేదని అంటున్నారు. ఇళ్ల కేటాయింపులకు ముందు చెప్పినట్లుగా అన్నివసతులూ కల్పించే వరకూ తాము బహిరంగ వేలాన్ని అడ్డుకుంటామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు.

వెల్లువెత్తిన డిమాండ్లు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని పలు పట్టణాల్లో రాజీవ్ సృగృహ కింద ఇండ్లస్థలాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. ఇవి కాకుండా ఇళ్ల నిర్మాణానికి, ఇండ్ల స్థలాల కోసం డబ్బు చెల్లించిన వారికి సైతం తిరిగి డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాని ఉన్న ఇండ్లస్థలాలను వేలం వేయకుండా దరఖాస్తు చేసుకుని ఇన్నేళ్లు ఎదురు చూసిన వారికే మొదటి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details