Fine Grain more sold in mahabubnagar district: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించిన సన్నరకం ధాన్యం... ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే ప్రైవేటులోనే ఎక్కువగా అమ్ముడు పోతోంది. వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. మేలు రకానికి ప్రభుత్వ మద్దతు ధర 2060 రూపాయలుంటే... బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర క్వింటాకు 2300 నుంచి 2600 వరకు పలుకుతోంది. మహబూబ్నగర్ మార్కెట్లో గరిష్ఠ ధర ఈనెల 7న 2400 రూపాయలు పలికింది.
నవంబర్ మొదటివారంలో మద్దతు ధరే పలికిన సన్నరకం ధాన్యం.. డిసెంబర్ నాటికి క్రమంగా పెరుగుతూ వస్తోంది. తేమశాతం, నాణ్యత బాగున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర మాత్రమే చెల్లిస్తున్నారు. పైగా డబ్బుల చెల్లింపులో ఆలస్యమవుతోంది. దీంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకునేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి సన్నరకం ధాన్యం నాణ్యత బాగుంది.
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి, నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మిల్లర్లతోపాటు, ఇతర ప్రాంతాల వ్యాపారులు బాదేపల్లి, మహబూబ్నగర్, దేవరకద్ర మార్కెట్లలో ఎక్కువగా పంట కొనుగోలు చేస్తున్నారు. బాదేపల్లి మార్కెట్కు నిజామాబాద్తో పాటు ఇతర జిల్లాల వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రెండు వారాలుగా ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ధాన్యం తేమశాతం కొంత ఎక్కువగా ఉన్నా పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎగుమతుల కోసం ఎక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో 100 రూపాయలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.