తెలంగాణ

telangana

ETV Bharat / state

Plastic House: ప్రకృతి హితం... ప్లాస్టిక్ బాటిళ్ల నిలయం - plastic bottles house in mahabubnagar

ఒకప్పుడు ఇంటి నిర్మాణం అంటే కర్రలు, రాళ్లు ఉపయోగించే కట్టేవారు. తర్వాత రోజుల్లో సిమెంట్ ఉపయోగించి నిర్మాణాలు చేపట్టారు. కాలక్రమేణా ఆధునిక యుగంలో మనుషుల ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్లుగా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. డబ్బు గురించి ఆలోచించకుండా... కొత్త పోకడలకు శ్రీకారం చుడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణం చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్ బాటిళ్లతో కట్టిన ఇల్లు... కొత్త ఆలోచనకు నాంది పలికింది. వ్యర్థ ప్లాస్టిక్​ బాటిళ్లతో ఇంటిని నిర్మించి పర్యావరణానికి కూడా మేలు చేసినవారయ్యారు. రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలిచే ఈ భవన విశేషాలు మీకోసం.

srinilayam
ప్లాస్టిక్ బాటిళ్ల నిలయం

By

Published : Jun 24, 2021, 9:14 AM IST

Updated : Jun 24, 2021, 5:28 PM IST

ప్రకృతి హితం... ప్లాస్టిక్ బాటిళ్ల శ్రీ నిలయం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఉన్న 'టచ్‌ స్వచ్ఛంద సంస్థ' ఆశ్రమంలో 64 మంది బాలబాలికలు ఉంటున్నారు. సినీ దర్శకుడు నాగ అశ్విన్‌ ఆలోచన మేరకు ఆశ్రమ భవనం నిర్మాణానికి పూనుకున్నారు. 133 గజాలలో 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పులో భవన నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు.

6వేల ప్లాస్టిక్ బాటిళ్లతో...

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సేకరించిన 6 వేల ఖాళీ శీతల పానియాల సీసాలను సేకరించారు. అనంతరం వాటిని శుభ్రపరిచి మూతలను సమకూర్చారు. కింది భాగంలో విశాలమైన హాలు నిర్మాణం చేసేందుకు పది అడుగుల లోతు తవ్వి గ్రానైట్‌ రాళ్లతో సెల్లార్‌ నిర్మాణం చేపట్టారు. నాలుగు పిల్లర్ల ద్వారా 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవులో సిమెంట్‌ కాంక్రీట్‌ స్లాబ్‌ వేశారు. అనంతరం గోడల నిర్మాణంలో భాగంగా 14 అంగుళాల మందంతో వచ్చేటట్టుగా రెండు వరుసలుగా ప్లాస్టిక్‌ బాటిళ్లను ఇసుక, మట్టితో పేర్చి మధ్యలో సిమెంటు కాంక్రీట్‌‌ వేసి గోడలు నిర్మించారు.

సహజ సిద్ధంగా...

సీసాలపై బరువు పడకుండా మధ్యలో ప్రతి నాలుగు అంగుళాలకు ఇనుప చువ్వలు, కాంక్రీట్‌తో బెడ్‌ వేశారు. తక్కువ సీసాలు వినియోగించే విధంగా పెద్ద పరిమాణంలో గుండ్రని ఆకారంలో కిటికీలను ఏర్పాటు చేశారు. అందుకు నీటి ట్యాంక్‌ల నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్‌ రింగ్‌లను వాడి అద్దాలు బిగించారు. ఇరువైపుల గోడలను ఈ విధంగానే ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ బాటిళ్లతో నిర్మించిన గోడలకు బయటి వైపు ఇరువైపుల ప్లాస్టింగ్‌ చేయలేదు. సహజ సిద్ధంగా అందంగా కనిపిస్తున్నాయి.

లోపల చిత్రాలు...

బయటి భాగంలో ప్లాస్టిక్‌ సీసాలు సహజసిద్ధంగా కనిపించే విధంగా ఉన్నా... బల్లులు, ఇతర కీటకాలు ఆవాసాలు చేసుకోకుండా లోపలి భాగంలో మాత్రం సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేశారు. ఆహ్లదకర వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో లోపల వైపు గోడలకు రంగులను ఉపయోగించి చిత్రాలను వేయించారు. సీసాలతో నిర్మించిన గోడలపై భారం పడకుండా స్తంభాలు, రేకులను వినియోగించి పైకప్పు నిర్మాణం చేపట్టారు.

మొత్తం ఖర్చు 9 లక్షలు...

భూ ఉపరితలానికి కింది భాగంలో నిర్మించిన సెల్లార్‌ను తరగతి గదులు, ఆడిటోరియం, డార్మెటరిగా ఉపయోగించుకోనున్నారు. సెల్లార్‌ పైన కంప్యూటర్‌ ల్యాబ్‌, మిని గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆశ్రమ భవనంలా మంచి రూపం ఇచ్చేందుకు ఫ్యాబ్రికేషన్‌ చేపట్టారు. భవన నిర్మాణానికి వాడిన ప్లాస్టిక్‌ బాటిళ్లను జీహెచ్‌ఎంసీ సమకూర్చగా... సెల్లార్‌ నిర్మాణానికి రూ. 2 లక్షల 40 వేలు, మొదటి అంతస్తు కోసం వేసిన స్లాబ్‌కు 2లక్షల 40వేలు, ఫ్యాబ్రికేషన్‌ పనులకు మరో 2లక్షల 60 వేల ఖర్చు అయినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో భవన నిర్మాణానికి సుమారు రూ. 9 లక్షలు వెచ్చించామన్నారు.

ఇదీ చూడండి: Balkampeta: ఈనెల 13న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

Last Updated : Jun 24, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details