Sarpanchs protests for Panchayat bills : గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా జనం వెళ్లేది సర్పంచ్ దగ్గరికే. పల్లెల్లో ప్రజల అవసరాలు తీరాలన్నా, ప్రగతి బాటలు వేయాలన్న సర్పంచ్లదే కీలక భూమిక. అలాంటి గ్రామ సర్పంచ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బిల్లులు చెల్లించాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కొందరు సర్పంచ్లు ధర్నా చేశారు.
పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, చెత్తను వేరు చేసే షెడ్లు, డంపింగ్ యార్డులు, హరితహారం, ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. చాలాచోట్ల సర్పంచ్లే ముందుండి పనులు పూర్తి చేయించారు. ముందుగా నిధులు రాకపోయినా తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి పనుల్ని పూర్తి చేశారు. కొన్నిచోట్ల సర్పంచ్లు రైతు వేదికల నిర్మాణాలను సైతం స్వయంగా చేపట్టారు. వచ్చే నిధుల్ని అంచనా వేసుకుని సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఆయా శాఖల నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప సర్కారు నుంచి బిల్లులు రావడం లేదని సర్పంచులు వాపోయారు.