Revanth Reddy Public Meeting at Palakurthy : సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanthreddy) ఆరోపించారు. ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ(Congress Vijaya Bheri Sabha)లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
'పాలకుర్తి జిల్లాలో 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు ఏకచత్రాధిపత్యం వహించారు. ఈ పాలకుర్తిలో 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేశారు. ఈ ఐదేళ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న దయాకర్ రావు వందల మంది సర్పంచ్లు ఆందోళనలు, ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆ సంఘాలను పిలిపించి కారణం ఏంది? ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఏనాడైనా అన్నారా? ఈరోజు వందల మంది సర్పంచ్లు ముఖ్యంగా లంబాల తండాలలో, ఆదివాసీ గూడెలలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో రూ.360 కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్.. ఇవాళ రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు దోచుకుంటుంటే.. రాజేందర్రెడ్డి కుటుంబం దానధర్మాలు చేశారని' తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి అన్నారు.
"కాంగ్రెస్ అధికారంలోకి రాగానే- ధరణిని రద్దు చేసి మెరుగైన పోర్టల్ను తీసుకొస్తాం"
Revanth Reddy Fires on Errabelli Dayakar Rao :పోరాటాల గడ్డ పాలకుర్తికి ఒక చరిత్ర ఉందని.. దొరల గడియలు బద్దలు కొట్టిన చాకల ఐలమ్మ స్ఫూర్తి ఈ నేలపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి సర్పంచుల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించలేదని విమర్శించారు. 40 ఏళ్ల క్రితం డీలర్గా ఉన్న దయాకర్రావు.. డాలర్ దయాకర్గా ఎలా మారారని ఎద్దేవా చేశారు. రేషన్ డీలర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలని కోరారు.