జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెరలో హనుమాన్ ఆలయానికి సంబంధించిన... 225, 519 సర్వే నంబర్లలలో 29.19 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో సగం వరకూ ఇప్పటికే అన్యాక్రాంతమైంది. తాజాగా ఆలయ భూముల్లో రైతు వేదిక నిర్మాణం చేస్తున్నారని... ఆ నిర్మాణాన్ని ఆపాలంటూ... రెవిన్యూ అధికారులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. రైతు వేదిక నిర్మాణం కోసం సర్వే నంబర్ 524లో 20 గుంటల భూమిని కేటాయించామని తహసీల్దార్ ఆలయ అధికారులకు తెలిపారు. రెవిన్యూశాఖ కేటాయించిన స్థలంలో కాకుండా ఆలయ స్థలంలో నిర్మాణం చేపట్టడం... వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే... ఉన్న భూమినికి కనీసం శాఖ దృష్టికి తీసుకురాకుండా, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అదీ ప్రభుత్వ భవన నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశం అవుతోంది.
కోట్లలో...
గద్వాల నుంచి రాయచూరుకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకునే ఈ భూములున్నాయి. మొత్తం 29 ఎకరాల భూముల విలువ కోట్లలో ఉంటుంది. అలాంటి భూముల్లో నిర్మాణం చేసేటప్పుడు... సంబంధిత శాఖ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గట్టు మండల తహశీల్దార్, ఎంపీడీఓలు స్పందించి... రైతు వేదిక నిర్మాణాన్ని ఆపాలని దేవాదాయశాఖ అధికారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ సహా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.