తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2021, 1:32 PM IST

ETV Bharat / state

ఆస్ట్రేలియాలో పరిణయం.. అంతర్జాలంలో ఆశీర్వాదం

కరోనా రాక ప్రపంచగతినే మార్చింది. ఎన్నో విషయాల్లో పెనుమార్పులు సంభవించాయి. బంధుమిత్రుల మధ్య సందడిగా సాగే పెళ్లిళ్లకు గడ్డుకాలం ఏర్పడింది. విదేశాల్లో ఉన్నవారైతే స్వదేశానికి వచ్చే అవకాశం లేక వర్చువల్‌(Virtual Marriage) పద్ధతిలో చేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి వివాహమే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది. వధూవరులిద్దరూ సిడ్నీలో వివాహం చేసుకుని ఒకటైతే వారి తల్లితండ్రులు ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ మహబూబ్​నగర్ నుంచి ఆశీర్వదించారు. కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో కల్యాణక్రతువును సాదాసీదాగా ముగించారు.

virtual marriage, online marriage
ఆన్​లైన్ పెళ్లి, వర్చువల్ వివాహం

కరోనా ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో మారిపోయాయి. చివరకు పెళ్లిళ్లు భిన్నంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. అలాంటి పెళ్లే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగింది. ఆస్ట్రేలియాలో వివాహబంధంతో ఒక్కటైన జంటను.. తల్లిదండ్రులు ఆన్​లైన్(Virtual Marriage)​లో వీక్షించి మహబూబ్​నగర్ నుంచి ఆశీర్వదించారు. బంధువులందరినీ పిలిచి ఎప్పటికీ గుర్తిండి పోయేలా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని భావించినా.. కొవిడ్, లాక్​డౌన్ కారణంగా వారి ఆశలు నెరవేరలేదు. పెళ్లిచూపులు, ఎంగేజ్​మెంట్ సహా పెళ్లి, తల్లిదండ్రులు లేకుండానే జరిగిపోయాయి. కరోనా జడలు విప్పుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న పెళ్లి వీక్షిస్తున్న తల్లిదండ్రులు

పాలమూరు వధూవరులు.. సిడ్నీలో వివాహం

మహహబూబ్ నగర్ భగీరథ కాలనీలో నివాసముండే విశ్రాంత తహసీల్దార్‌ సుదర్శన్ రెడ్డి కుమారుడు వంశీధర్ రెడ్డి, ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డి కుమార్తె సాహితి ఆస్ట్రేలియా సిడ్నీలో నివాసముంటారు. వంశీధర్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, సాహితి అక్కడే పీజీ చదువుతోంది. ఏడాది క్రితమే ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు ఏర్పడ్డాయి. మాటల మధ్య పిల్లలిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉండటంతో ముడిపెడితే బాగుంటుందని పెద్దలు నిశ్చయించారు.

ఆన్​లైన్​లో పరిణయం..

కరోనా, లాక్‌డౌన్‌తో పిల్లలు స్వదేశానికి రాలేని పరిస్థితి. ఆస్ట్రేలియాలోనే ఓ గుళ్లోనే పెళ్లి చూపులు... ఆ తర్వాత నిశ్చితార్థాన్ని అక్కడ నిర్వహించగా అంతర్జాలంలో తల్లిదండ్రులు, బంధువులు వీక్షించారు. కనీసం కల్యాణమైన ఘనంగా చేద్దామనుకుంటే సెకండ్‌ వేవ్‌ కొవిడ్ ఉద్ధృతితో అదీ సాధ్యపడలేదు. చివరకు సిడ్నీలోనే కొద్దిమంది సమక్షంలోనే సంప్రదాయ బద్దంగా వివాహ వేడుకను నిర్వహించారు.

అంతర్జాలంలో వీక్షణ

వివాహవేడుకను వధూవరుల తల్లితండ్రులు,బంధువులు మహబూబ్‌నగర్‌లో ఆన్‌లైన్​(Virtual Marriage)లో తిలకించారు. బంధువులకు లైవ్‌ లింక్‌ పంపడంతో అందరూ అంతర్జాలంలోనే పెళ్లిని వీక్షించారు. మహమ్మారి వల్ల వధూవరుల తల్లిదండ్రులు లేకుండానే పెళ్లి తంతు ముగిసింది. ప్రత్యక్షంగా లేమనే బాధ తప్ప ఆన్‌లైన్ పెళ్లి ఆనందంగానే ఉందని వధువరుల కన్నవారు చెబుతున్నారు.

ఇదే సరికొత్త పోకడ

ఆన్​లైన్‌లో వివాహ వేడుక(Virtual Marriage)ల్ని వీక్షించడం ప్రస్తుతం కొత్త పోకడగా మారుతోంది. కొవిడ్ నుంచి తప్పించుకోవాంటే అంతకుమించిన మార్గం లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details